హోటల్స్ కు గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోటా పెంపు
గత కొన్ని వారాలుగా గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పుంజుకోవడంతో, రాష్ట్రాలు... కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ల కేటాయింపును శనివారం మరో 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు అందుబాటులో ఉండే గ్యాస్ సరఫరా ఇప్పుడు 50 శాతానికి చేరుకుంది.
పశ్చిమాసియాలో గత మూడు వారాలుగా సాగుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్లకు కొరత రాకుండా చూసేందుకు, ప్రభుత్వం తొలుత వాణిజ్య సంస్థలకు సరఫరాను దాదాపు నిలిపివేసింది. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో దశలవారీగా ఈ సరఫరాను పెంచుతూ వస్తోంది. తాజా నిర్ణయంతో హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు మరియు ఆహార శుద్ధి యూనిట్లకు గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.

షరతులు వర్తిస్తాయి.. పైపుల కనెక్షన్ తప్పనిసరి!
అదనపు గ్యాస్ కేటాయింపులు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. చమురు మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం.. వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా చమురు కంపెనీల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాకుండా, భవిష్యత్తులో పైపుల ద్వారా సహజ వాయువు (PNG) పొందేందుకు దరఖాస్తు చేసుకున్న సంస్థలకే ఈ అదనపు కేటాయింపులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇళ్లలో గ్యాస్ కష్టాలు లేవు!
మరోవైపు, సామాన్య ప్రజలకు అందించే వంటగ్యాస్ సరఫరా ప్రస్తుతం సుస్థిరంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గ్యాస్ అయిపోతుందనే భయంతో అడ్వాన్స్ బుకింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదని, పంపిణీ కేంద్రాల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిర్ణీత గడువు ప్రకారం బుక్ చేసుకుంటే సాధారణ డెలివరీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముఖ్యంగా వలస కార్మికులకు తక్కువ ధరకే భోజనం అందించే రాయితీ ఆహార కేంద్రాలకు పెద్ద ఊరట లభించనుంది.












Click it and Unblock the Notifications