ఆగస్టు 1 నుంచి ఒకే ఒక 'కస్టమర్ ఐడీ'! బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
దేశంలో డిజిటల్ ఆర్థిక సేవలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. బ్యాంకు ఖాతా తెరిచినా, కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినా.. ప్రతిసారీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు సమర్పించి విసిగిపోతున్న కస్టమర్లకు కేంద్రం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది.
ఇకపై దేశంలోని అన్ని రకాల ఆర్థిక సేవలకు ఒకే 'కామన్ కస్టమర్ ఐడీ' విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సింగపూర్, ఐరోపా దేశాల తరహాలో భారత్లో రూపుదిద్దుకుంటున్న ఈ సాంకేతిక పరిణామం బ్యాంకింగ్ రంగాన్నే మలుపు తిప్పనుంది.

ఆగస్టు నుంచి తొలిదశ.. అసలు ఎలా పనిచేస్తుంది?
'సెంట్రల్ నో-యువర్-కస్టమర్ 2.0' (CKYC 2.0) పేరుతో రూపుదిద్దుకున్న ఈ నూతన వ్యవస్థ ఆగస్టు నెల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. తొలిదశలో బ్యాంకింగ్, బీమా రంగాలకు ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నారు. ఉదాహరణకు, మీరు ఇప్పటికే ఒక బ్యాంకులో కేవైసీ వివరాలు పూర్తి చేసి ఉంటే, కొత్తగా మరో బ్యాంకులో ఖాతా తెరిచినా లేదా ఇన్సూరెన్స్ తీసుకున్నా మళ్లీ కాగితాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. మీ కామన్ ఐడీ ఆధారంగా, మీ ఫోన్కు వచ్చే ఒక్క ఓటీపీ ద్వారా మీ అనుమతి తీసుకుని.. సెంట్రల్ డేటాబేస్ నుంచి బ్యాంకులు మీ సమాచారాన్ని నేరుగా సేకరించుకుంటాయి.
మార్కెట్లలోకి వ్యాపారాల విస్తరణ..
గతంలోనే మన వద్ద కస్టమర్ల సమాచార రికార్డులు ఉన్నప్పటికీ, వాటిలో తప్పులు ఉండటం వల్ల బ్యాంకులు ప్రతిసారీ కొత్తగా వివరాలను అడిగేవి. అయితే, నూతన సిస్టమ్లో డేటా కచ్చితత్వాన్ని బట్టి ప్రత్యేక 'ట్రస్ట్ స్కోర్'ను కేటాయిస్తారు. దీనివల్ల నకిలీ ఖాతాలకు, ఆర్థిక అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల తర్వాత ఈ ఏడాది చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలను కూడా ఈ నెట్వర్క్తో అనుసంధానించనున్నారు. దీనివల్ల సులభంగా పెట్టుబడులు పెట్టే అవకాశం దక్కుతుందని, ఇన్వెస్టర్ల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సామాన్యుడికి లభించనున్న పెద్ద ఊరట!
బ్యాంకింగ్ రంగంలో ప్రాథమిక ఖాతాలు తెరిచే ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకోగా, ఇప్పుడు ఆ ఖాతాదారులను ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వైపు నడిపించేందుకు ఈ కామన్ ఐడీ ఒక మార్గదర్శకంగా మారనుంది. సమయం ఆదా అవ్వడంతో పాటు మోసాలకు తావులేకుండా ఉండే ఈ విధానం ఆగస్టు నుంచి అమలులోకి వస్తుండటంతో సామాన్య వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.












Click it and Unblock the Notifications