ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్
భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేసే దిశగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక అడుగు వేసింది. కస్టమర్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చే ప్రక్రియ (ఆన్బోర్డింగ్) వేగంగా, సులభంగా, డిజిటల్తో పాటు భౌతిక మార్గాల్లో కూడా అందుబాటులో ఉండేలా కేవైసీ (Know Your Customer - KYC) నిబంధనల్లో పలు సవరణలను గురువారం ప్రకటించింది. ఈ మార్పులు ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల ప్రజలకు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పెద్ద ఊరటగా నిలవనున్నాయి.
ఆర్బీఐ (కేవైసీ) (సవరణ) ఆదేశాలు-2025 ప్రకారం, ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, వీడియో కేవైసీ (Video KYC), డిజిలాకర్ ద్వారా పత్రాల వినియోగాన్ని మరింత సరళీకరించారు. డీబీటీ, ఈబీటీ, పీఎంజేడీవై వంటి పథకాల ద్వారా తొలిసారిగా బ్యాంకింగ్ సేవల్లోకి అడుగుపెడుతున్న వారికి అడ్డంకులు తగ్గించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ను విస్తరించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు RBI స్పష్టం చేసింది.

మూడు మార్గాల్లో కస్టమర్ ఆన్బోర్డింగ్
ఇకపై బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, కేవైసీ పూర్తి చేయడం కోసం మూడు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉంటాయి. మొదటిది ముఖాముఖి (ఫేస్-టు-ఫేస్) పద్ధతి. ఈ విధానంలో వినియోగదారులు ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ఖాతా తెరవవచ్చు. ఆధార్లో ఉన్న చిరునామా ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాతో భిన్నంగా ఉన్నా, కేవలం స్వీయ ధృవీకరణ (Self Declaration) చాలు అని RBI స్పష్టం చేసింది. దీంతో చిరునామా ధృవీకరణ పేరుతో వచ్చే ఆలస్యాలకు చెక్ పడనుంది. డిజిటల్ కేవైసీని కూడా వ్యక్తిగతంగా పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు.
రెండవది నాన్-ఫేస్-టు-ఫేస్ (NFTF) ఆన్బోర్డింగ్. ఈ పద్ధతిలో కస్టమర్లు ఆధార్ OTP ఆధారిత ఈ-కేవైసీ ద్వారా రిమోట్గా ఖాతా తెరవవచ్చు. బ్యాంకులు డిజిలాకర్ పత్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, అవసరమైతే ధృవీకరించిన కాగితపు పత్రాలను కూడా అంగీకరించవచ్చు. అయితే, ఈ విధానంలో తెరిచిన ఖాతాలకు ఒక సంవత్సరంలోపు పూర్తి స్థాయి కస్టమర్ డ్యూ డిలిజెన్స్ (CDD) తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
మూడవది వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP). ఇది బ్యాంక్ అధికారితో లైవ్, సురక్షితమైన, కస్టమర్ సమ్మతి ఆధారిత వీడియో సంభాషణ ద్వారా గుర్తింపు ధృవీకరణ చేసే విధానం. ఈ వీడియో కేవైసీని ముఖాముఖి ఆన్బోర్డింగ్కు సమానంగా పరిగణిస్తామని RBI స్పష్టం చేసింది. కొత్త ఖాతాల ప్రారంభంతో పాటు ఇప్పటికే ఉన్న ఖాతాల కేవైసీ అప్డేట్లకు కూడా ఈ విధానం వర్తిస్తుంది.
CKYCR, BCల ద్వారా మరింత సులువు
ఆన్బోర్డింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు RBI కొన్ని అదనపు చర్యలను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్ సమ్మతితో సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (CKYCR) నుంచి ఇప్పటికే ఉన్న కేవైసీ వివరాలను బ్యాంకులు నేరుగా పొందవచ్చు. దీంతో ప్రతి బ్యాంక్ వద్ద మళ్లీ మళ్లీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
అదేవిధంగా, బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకెళ్లే ఉద్దేశంతో వ్యాపార ప్రతినిధులు (Business Correspondents - BCs) కు కూడా కేవైసీ అప్డేట్లు, ఆన్బోర్డింగ్లో సహాయం చేసే అధికారాలు ఇచ్చారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడంలో కీలకంగా మారనుంది.
డార్మెంట్ ఖాతాలు, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి
సంక్షేమ పథకాల కింద తెరిచిన ఖాతాలు సుదీర్ఘకాలంగా వినియోగంలో లేకపోతే (డార్మెంట్ అకౌంట్లు) వాటిని తిరిగి యాక్టివేట్ చేసే విషయంలో బ్యాంకులు సానుకూలంగా వ్యవహరించాలని RBI సూచించింది. ఎలాంటి అనవసర అడ్డంకులు లేకుండా లబ్ధిదారులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా చూడాలని ఆదేశించింది.
ఇకపై మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆన్బోర్డింగ్, కేవైసీ అప్డేట్ క్యాంపులు నిర్వహించాలని, లక్షిత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కూడా బ్యాంకులకు RBI సూచించింది.
మొత్తంగా చూస్తే, ఈ కొత్త కేవైసీ సవరణలు బ్యాంకింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడంతో పాటు, డిజిటల్ సౌలభ్యాలను విస్తరించి, దేశవ్యాప్తంగా ఆర్థిక సమావేశాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications