ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. కొత్త రూల్స్ ఇవే !
భారత దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంటర్ఛేంజ్ రుసుములు పెరగడమే దీనికి ప్రధాన కారణమని బ్యాంకు తెలిపింది. పెరుగుతున్న ఆపరేషన్ ఖర్చులను సమతుల్యం చేసుకునేందుకు ఈ మార్పులు తప్పనిసరిగా మారాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ అధికారికంగా వెల్లడించింది. ఈ మార్పుల ప్రభావం ముఖ్యంగా సేవింగ్స్ ఖాతాలు, శాలరీ ఖాతాదారులపై ఎక్కువగా పడనుందని చెబుతున్నారు. దీంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపింది.
కాగా సవరించిన నిబంధనల ప్రకారం ఎస్బీఐ ఖాతాదారులు ఉచిత పరిమితిని దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.21 (జీఎస్టీ అదనం)గా ఉండేది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్పై అదనంగా రూ.2 భారమవుతోంది. నగదు విత్డ్రాయల్ మాత్రమే కాకుండా బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్, పిన్ జనరేషన్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు పెరిగాయి. గతంలో రూ.10గా ఉన్న ఈ ఛార్జీని రూ.11కి (జీఎస్టీ అదనం) పెంచింది. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాతే ఈ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాదారుల విషయంలో మాత్రం ఒక ఊరట దక్కింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాతే పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. అలానే శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల విషయంలో కూడా ఎస్బీఐ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు వీరికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం ఉండేది. అయితే తాజా నిర్ణయంతో దీనిని నెలకు 10 లావాదేవీలకు పరిమితం చేసింది.
ఈ పరిమితిని దాటితే..
ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.23 + జీఎస్టీ
ప్రతి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.11 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికీ ఈ ఛార్జీలు వర్తించవు?
అయితే అన్ని ఖాతాలపై ఈ పెంపు వర్తించదని ఎస్బీఐ స్పష్టం చేసింది. BSBD (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్) ఖాతాలపై ఎలాంటి మార్పులు లేవు. ఎస్బీఐ డెబిట్ కార్డుతో ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలపై ఛార్జీలు యథాతథంగా ఉంటాయి. కార్డు లేకుండా చేసే క్యాష్ విత్డ్రాయల్స్ (Cardless Withdrawal) పైనా కొత్త ఛార్జీలు వర్తించవు
ఖాతాదారులు ఎక్కువ ఛార్జీలు చెల్లించకుండా ఉండాలంటే..
- వీలైనంతవరకు ఎస్బీఐ ఏటీఎంలనే ఉపయోగించడం
- ఉచిత లావాదేవీల పరిమితిని గుర్తుంచుకోవడం
- డిజిటల్ పేమెంట్స్, UPI వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించడం మంచిదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications