కేసీఆర్ అలా చేస్తుంటే.. జగన్ ఇలా..: రోజా సంచలన వ్యాఖ్యలు
చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే, సీఎం కేసీఆర్ మాత్రం తాము చర్చలు జరపమని, బేషరతుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని స్పష్టం చేశారు. అంతేగాక, ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులందర్నీ తొలగిస్తామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరును, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందనపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ అక్కడ అలా..
కేసీఆర్ అక్కడ నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగాల్లో నుంచి తీసేశారని.. ఏపీలో మాత్రం ఆర్టీసీ కార్మికులు అదృష్టవంతులని రోజా అన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైందని చెప్పారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైసీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఇక్కడ ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమం లేకపోయినప్పటికీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేర్చారని రోజా అన్నారు.
ఈ నిర్ణయం ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.

అక్కడ ఉద్యోగాలే తీసేశారు..
ఇక తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్నా.. అక్కడి ముఖ్యమంత్రి కార్మికుల్నిఉద్యోగాల్లో నుంచి తీసేశారని రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ వల్లే ఏపీఆర్టీసీలో సమస్యలు పరిష్కారమయ్యాయని ఆమె అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కార్మికులు అండగా నిలబడాలని అన్నారు. కాగా, ప్రస్తుతం రోజా సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications