అసాధారణం.. ఆరని కరోనా కాష్ఠం... ఆ ఒక్క శ్మశానంలోనే 4 రోజుల్లో 141 మృతదేహాలకు అంత్యక్రియలు..
దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోవిడ్తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో రోజుకు 80 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి. ఏపీలోని గుంటూరులోనూ గడిచిన రెండు రోజుల్లో 92 మందికి అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.

నాలుగు రోజుల్లో 141 మృతదేహాలకు...
గుంటూరులోని బొంగరాలబీడు మహాప్రస్థానంలో గత రెండు రోజుల్లో భారీ సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.మంగళవారం(ఏప్రిల్ 20) 40,బుధవారం(ఏప్రిల్ 21) 52 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. సాధారణ రోజుల్లో ఈ శ్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 18న 26 మృతదేహాలు,19న 23 మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

కోవిడ్ మరణాలేనా...?
ఇవన్నీ కోవిడ్ మరణాలేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇక్కడికి వస్తున్న మృతదేహాల్లో 80శాతం మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి... జిప్ వేసి పంపిస్తున్నారు. కోవిడ్తో మరణించినవారి మృతదేహాలకు మాత్రమే ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. జీజీహెచ్,కొత్తపేటలోని ప్రేవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడికి మృతదేహాలను తరలిస్తున్నారు. బొంగరాలబీడుతో పాటు గుంటూరులోని స్తంభాలగరువు,సంగడిగుంట.. ఇలా మొత్తం 11 శ్మశాన వాటికలకు మృతదేహాల తాకిడి ఎక్కువైంది.

డెత్ సర్టిఫికెట్స్లో అలా...
ఇక్కడి శ్మశానాలకు తరలిస్తున్న మృతదేహాల్లో 90శాతం కోవిడ్ మరణాలేనని తెలుస్తోంది. అయితే కొందరి డెత్ సర్టిఫికెట్లో మాత్రం గుండెపోటుతో చనిపోయినట్లుగా చూపిస్తున్నారు. అయితే వారి మెడికల్ రిపోర్టులను పరిశీలిస్తే మాత్రం ఇవి కోవిడ్ మరణాలేనని తెలుస్తోంది. కొందరికి మరణం తర్వాత కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అవుతుండగా... మరికొందరికి బైలేటరల్ న్యుమోనియాగా డెత్ సర్టిఫికెట్లో చూపుతున్నారు. చికిత్స సమయంలో కోవిడ్ అని చెప్పి... చనిపోయాక మాత్రం గుండెపోటు అని డెత్ సర్టిఫికెట్ ఇస్తుండటం మృతుల కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తోంది.

విరామం లేకుండా...
గతేడాది కరోనా ఉధృతి పీక్స్లో ఉన్నప్పుడు కూడా గుంటూరులో రోజుకు 15 నుంచి 20 మృతదేహాలకే అంత్యక్రియలు జరిగాయి. కానీ ఇప్పుడా సంఖ్య దాదాపు రెట్టింపయింది. కోవిడ్ మరణాలు కాబట్టి మృతదేహాల వెంట కుటుంబ సభ్యులు,బంధువులు ఎవరూ రావట్లేదు. దీంతో శ్మశాన సిబ్బందితో పాటు కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు విరామం లేకుండా పనిచేయాల్సి వస్తోందని... నిద్రాహారాలు కూడా మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఒక ఛారిటబుల్ ట్రస్టు సభ్యుడు తెలిపారు.












Click it and Unblock the Notifications