బాపట్ల బీవోబీలో రూ. 2 కోట్ల విలువైన బంగారం చోరీ: అటెండరే ప్రధాన సూత్రధారి
అమరావతి: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయం కావడం కలకలం సృష్టిస్తోంది. అయితే సొంతింటి మనిషే దొంగ అని తేలడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాంకులో అటెండర్గా పనిచేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు.
సెప్టెంబర్ 2న బ్యాంకులో ఆభరణాల ఆడిటింగ్ జరగగా.. అదే రోజు సుమంత్ రాజు సెలవు పెట్టాడు. ఆడిటింగ్లో బంగారు ఆభరణాలు కనిపించకపోవడం, సుమంత్ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన పోలీసులు.. సుమంత్ రాజుకు సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు అధికారులతోపాటు స్ట్రాంగ్ రూంలోకి తరచూ వెళ్లే సుమంత్ వారి కళ్లు గప్పి ఆభరణాలను తస్కరించేవాడని గుర్తించారు. బ్యాంక్ నుంచి చోరీ చేసిన బంగారం విలువ రూ. 2.2 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
కాగా, చోరీ చేసిన బంగారాన్ని సుమంత్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు తెలిసింది. బంగారం చోరీ జరిగిందని తెలియడంతో ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. తాము తాకట్టు పెట్టిన ఆభరణాలు పోయాయని బాధితులు వాపోయారు. బంగారం ఎక్కడ ఉందో గుర్తించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. దీంతోవారు వెళ్లిపోయారు. బంగారం చోరీలో ఇంకా ఎవరెవరి హస్తముందనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు.
చిత్తూరు జిల్లాలోనూ బ్యాంక్ మోసం: ఆరుగురు అరెస్ట్
చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. మరో ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు బ్యాంక్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. బదిలీపై వెళ్లిన అసిస్టెంట్ మేనేజర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఆర్ఐ ఖాతాల నిధులు కూడా దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా 120 పొదుపు సంఘాల ఖాతాలను విచారించాల్సి ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications