అమృతకు మగబిడ్డ ఫేక్..! డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..! సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?
హైదరాబాద్ : సోషల్ మీడియా వాడకం పెరిగిన తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అరచేతిలో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతుంటే.. ఇంటర్నెట్ స్పీడ్ మించిపోయి సమాచారం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వచ్చిందే నిజమని నమ్మితే బోర్లాబొక్క పడుతున్న సందర్భాలున్నాయి. అదే సమయంలో ఫేక్ అనుకుంటే అవే నిజమవుతున్నాయి. దీంతో రైటేదో, రాంగేదో తెలియని పరిస్థితుల్లో నెటిజన్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు సోషల్ మీడియా తీరుకు అద్దం పడుతున్నాయి.
ఫేక్.. షేక్..!
మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల కిందట ఆమె తండ్రి.. ప్రణయ్ ను హత్య చేయించారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అప్పటికే అమృత గర్భం దాల్చింది. అయితే ఆమె ప్రసవం కావడానికి డాక్టర్లు జనవరి నెలలో సమయమిచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే విషయం గట్టిగా పట్టుకున్న కొందరు, ఇటీవల సోషల్ మీడియాలో అమృత మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు.
దీంతో వార్తా ఛానళ్లు, వెబ్ మీడియా ఇలా ప్రతిఒక్కరు ఆ వార్తను ధృవీకరించుకోకుండా పబ్లిష్ చేశాయి. అయితే వేగంగా వార్త అందించాలనే తొందరలో తప్పు దొర్లింది. అసలు అమృత ఇంకా డెలివరీ కాలేదు. ఆ మేరకు అది ఫేక్ వార్తంటూ ఖండించారు అమృత. ఆ వార్త నమ్మొద్దంటూ జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. వాస్తవానికి డాక్టర్లు ఫిబ్రవరి 4న డెలివరీ డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు కూడా అమృత డెలివరీ అయినా కాకున్నా ఎన్ని కథనాలు వస్తాయో మరి.
అదే నిజమని నమ్మితే.. పదవులు పోయే..!
తెలంగాణలోని మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వాట్సాప్ దెబ్బకొట్టింది. ఏకంగా ఓ గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లు లేకుండా చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో రంజిత్ నాయక్ తండాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా వాట్సాప్ లో షికారు చేసింది. దీంతో రంజిత్ నాయక్ తండా గ్రామస్థులు అదే నిజమనుకున్నారు. అనంతరం అధికారులు విడుదల చేసిన ఒరిజినల్ రిజర్వేషన్ల జాబితాను ఎవరూ పట్టించుకోలేదు.
వాట్సాప్ లో వచ్చిందే వాస్తవమనుకుని.. అందులో సూచించిన రిజర్వేషన్ల మేరకు సర్పంచితో పాటు వార్డుమెంబర్లను ఏకగ్రీవం చేసుకున్నారు. తీరా నామినేషన్ల దాఖలు చివరిరోజు నాడు అసలు విషయం బయటపడింది. ఆరు వార్డులకు గాను రెండు వార్డుల్లో బీసీ నేతలు వేసిన నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. ఎందుకంటే అవి ఎస్టీ రిజర్వుడు స్థానాలు. అలా సోషల్ మీడియా సమాచారం నిజమని నమ్మితే రెండు వార్డుల్లో ఎన్నికలు జరగకుండా పోయాయి.
వైరల్ గా మారుతున్న ఫేక్ న్యూస్
టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో, ఏ సమాచారం కావాలన్నా ఫింగర్స్ టచ్ తో నెట్టింట్లో దొరికిపోతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఫేక్ న్యూస్ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్లు 50 శాతం కడితే చాలంటూ డిసెంబర్ నెలలో సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అయింది. హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియానికి రావాలంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆ మర్నాడే ట్రాఫిక్ పోలీసులు అది ఫేక్ న్యూస్, నమ్మొద్దంటూ వివరణ ఇచ్చారు.
ఫేక్ న్యూస్ నమ్మినోళ్లు.. ట్రాఫిక్ పోలీసుల వివరణ మాత్రం పట్టించుకోలేదు. దీంతో అబదర్ధపు వార్తలో సూచించిన తేదీ నాడు గోషామహల్ స్టేడియానికి జనాలు క్యూ కట్టారు. తీరా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశ చెంది వెనుదిరిగారు. ఇలాంటివి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తక్కువే. మొన్నటికి మొన్న కిరణ్ బేడీ ఏపీ గవర్నర్ అంటూ రూమర్లు వచ్చాయి. చివరకు అది అబద్ధమని స్వయంగా ఆమె చెప్పుకోవాల్సి వచ్చింది.
సమాచారం ఏదైనా అనుమానంగా అనిపించినప్పుడు.. నలుగురితో డిస్కస్ చేస్తే కొంతలో కొంత నిజమా అబద్ధమా అనేది తేలిపోతుంది. కానీ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో అది సాధ్యపడటం లేదు. అందుకేనేమో ఫేక్ వార్తలు రాజ్యమేలుతున్నాయి. దీనిక అడ్డుకట్ట ఎవరూ వేయరు. మనమే జాగ్రత్తపడాలి.