మార్పునకు నాంది, మునుగోడు విజయంపై మంత్రి హరీశ్ రావు
మునుగోడు బై పోల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో మార్పునకు ఈ ఫలితం నాంది పలికిందని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజానీకం ఎవరి పక్షాన ఉందో ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైందని అన్నారు.
మునుగోడు ప్రజలు బీజేపీ కుట్రలను ఛేదించారని హరీశ్ రావు పేర్కొన్నారు. బీజేపీ అహంభావాన్ని మునుగోడు ఓటర్లు అణచివేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య సాగిన పోరాటంలో మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని తెలిపారు. వారికి మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
మునుగోడులో 100 బెడ్ల ఆస్పత్రి హామీ ఇచ్చింది. అలాగే చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది. సీఎం కేసీఆర్ రెండు సభల్లో పాల్గొని ప్రసంగించారు. మంత్రులు గ్రామ గ్రామాన తిరిగారు. ఉద్యోగ ప్రకటన కూడా చేసింది. ఇదే కాదు చేనేత భీమా కూడా అమలు చేశారు. గౌడ భీమా కూడా చేస్తామని చెప్పారు.
ఇలా ఒక్కొక్క కులానికి, వర్గానికి మేలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అదీ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అనుకొని ఉంటారు. అందుకే రాజగోపాల్ రెడ్డిని కాదని.. ప్రభాకర్ రెడ్డికి జనం పట్టం కట్టారు. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ జోష్లో ఉంది.