హైదరాబాద్ శివార్లలో చెడ్డీ గ్యాంగ్ కలకలం: ఈ దొంగల కసరత్తు మామూలుగా ఉండదు, పోలీసుల సెర్చ్
హైదరాబాద్: నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ శివార్లలోని నాగారం, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు రాచకొండ పోలీసులు నిర్ధారించారు. దీంతో చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

అటవీ ప్రాంతాల్లో ఉండే చెడ్డీ గ్యాంగ్ తెగ..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని అడవుల్లో నివసించే పలు తెగలను చెడ్డీ గ్యాంగ్ అని పిలుస్తుంటారు. కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా కొన్ని రాష్ట్రాల్లోని పోలీసులు పిలుస్తున్నారు. ఒక్కో ముఠాలో పది నుంచి 15 మంది వరకు ఉంటారని, ఇలాంటి ముఠాలు వందల సంఖ్యలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

బిచ్చగాళ్లుగా, బొమ్మలమ్ముతూ టార్గెట్లపై కన్నేసే చెడ్డీగ్యాంగ్
ఈ గ్యాంగ్లు బనియన్లు, చెడ్డీలు ధరించి.. చేతిలో రాడ్లతో దొంగతనాలు చేస్తుంటారు. ఒక్కో నగరానికి కొన్ని ముఠాలు వెళ్తాయి. వీరు ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. నగరాలకు చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో లేదా ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని తాత్కాలిక నివాసం ఉంటారు. పగలు బిచ్చగాళ్లుగా లేదంటే ఇంటింటికి తిరిగి బొమ్మలు, దుప్పట్లు విక్రయిస్తుంటారు. ఇలా తిరుగుతూ సంపన్నుల ఇళ్లను గుర్తించి సమాచారం ఇస్తే.. గ్యాంగ్లోని పురుషులు దోపిడీలకు పాల్పడతారు.

కార్తీ ‘ఖాకీ’ సినిమా తరహాలోనే చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు
హీరో కార్తీ నటించిన 'ఖాకీ' సినిమా తరహాలోనే ఈ చెడ్డీ గ్యాంగ్ కూడా నిర్మానుష్య ప్రాంతాలు, కాలనీల్లో దొంగతనాలకు పాల్పడతారు. అయితే, ఈ గ్యాంగ్ తాళం వేసిన ఇళ్లలోనే దోపిడీలకు పాల్పడుతుంది. దొరకకుండా ఉండేందుకు శరీరానికి నూనె లేదా గ్రీజును పూసుకుంటారు. చప్పుడు రాకుండా తాళాలను పగలగొట్టి.. డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలను దోచేస్తారు. ఆభరణాల ధరలు వీరికి తెలికిపోయినప్పటికీ.. తులం బంగారాన్ని రూ. 10వేల వరకు అమ్మేస్తుంటారు. దోచేసిన బంగారాన్ని ఎప్పటికప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని వారికి చేరవేస్తుంటారు.
Recommended Video


ఈ చెడ్డీ గ్యాంగ్.. అంతా ప్లాన్ ప్రకారమే చేస్తారు..
చోరీలు చేసిన తర్వాత పని ఇప్పించాలని పలువురిని అడిగి.. దొంగతనాల గురించి స్థానికంగా ఏమనుకుంటారని ఈ గ్యాంగ్ తెలుసుకుంటుంది. ఒక ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడి ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోతారు. మరో ఆరు నెలలపాటు ఆ ప్రాంతంవైపు వెళ్లరు. గ్యాంగ్లో ఎవరైనా దొరికినా కూడా మిగితావారి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వరు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ గ్యాంగ్ దొంగతనాలు పాల్పడుతూ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దొంతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఈ గ్యాంగ్ పని పట్టేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి శ్రమ ఫలిస్తే త్వరలోనే ఈ చెడ్డీ గ్యాంగ్ కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమే.












Click it and Unblock the Notifications