నయవంచకుడు, నంబర్ వన్.. కేసీఆర్పై రాములమ్మ విసుర్లు..
సీఎం కేసీఆర్పై బీజేపీ ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి మండిపడ్డారు. ఆయన కబుర్లతో నయవంచన చేయడంలో నెంబర్ వన్ ధ్వజమెత్తారు. ఈ విషయం క్రమంగా అందరికీ తెలిసిందని వివరించారు. సోమవారం సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం వింటే అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఏమిటో బాగా అర్థమవుతుందని విజయశాంతి అన్నారు. దళిత బంధు పథకం గురించి వివిధ గణాంకాలు, బడ్జెట్ కేటాయింపులు అని అంకెల గారడీ చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుల సమస్యలకు ఏకైక పరిష్కారం పథకమే అన్నట్టుగా చెప్పుకొచ్చారని ఫైరయ్యారు. గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలు ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారని ఫైరయ్యారు. ఆ తర్వాత దళిత ఉపముఖ్యమంత్రులు ఇద్దరినీ పక్కకు నెట్టేసి దళితులకు ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో కళ్లారా చూశాం అని చెప్పారు. ఆరంభ శూరత్వం తప్ప మరొకటి తెలియని కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందేనని రాములమ్మ తప్పుబట్టారు.
కేసీఆర్ చేసిన ప్రసంగంలోని మిగతా అంశాలను రాములమ్మ ప్రస్తావించారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందన్నారని గుర్తుచేశారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని చెప్పారని, పరిస్థితులు ఇంత గొప్పగా ఉన్నప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతులకు సమస్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. హరితహారంతో పచ్చదనం పెరిగిందన్న సీఎం కేసీఆర్... ఈ పథకం కోసం స్వంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైనవారి గురించి తెలియదా? అని నిలదీశారు.
రాష్ట్రాన్ని సర్కారు అంత గొప్పగా అభివృద్ధి చేసి ఉంటే... పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నిరసన జ్వాలలు ఎదుర్కొవలసి వచ్చిందో చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ చెబుతుంది ఒకటి.. చేస్తుంది మరొకటి అని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలుసు అని వివరించారు. ప్రజలకు క్రమంగా అర్థమవుతోందని చెప్పారు. వారంతా తగిన సమయం కోసం చూస్తున్నారని తెలిపారు. జనాలకు ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.
Recommended Video