పెళ్లి పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసిన సైబర్ ఫ్రాడ్...!
సైబర్ నేరగాడి మాయలో పడి నగరానికి చెందని ఓ ప్రభుత్వ ఉద్యోగిని సైతం మోసపోయింది. మాట్రిమోనియల్ వెబ్సైట్లో సెర్చ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పిన సైబర్ నేరగాడు యువతి వద్ద లక్షలు దోచాడు. విదేశాల్లో తానోక బిల్డర్ అంటూ బిల్డప్ ఇచ్చాడు. కష్టకాలం వచ్చిందంటూ... ఆమె వద్ద డబ్బులు లాగాడు. ఇలా ఒకటికి రెండు సార్లు డబ్బులు గుంజడంతో అనుమానం వచ్చిన ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేరగాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సికింద్రాబాద్లో ఘటన
నగరంలోని సికింద్రాబాద్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని భారత్మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. దీంతో ఆమె ప్రొఫైల్ చూసిన లోకేష్ జోషి అని పరిచయం అయిన ఓ వ్యక్తి నుండి ఆమెకు మెసెజ్ వచ్చింది. తాను స్కాట్లాండ్లో బిల్డర్ అని, మాట్రిమోనియల్ వెబ్సైట్లో పెట్టిన ఆమె ఫ్రొఫైల్ నచ్చిందని చెప్పారు. ఈనేపథ్యంలోనే పరిచయం అయిన తర్వాత ఫోన్ నంబర్లు తీసుకున్నారు. అనంతరం కొద్ది రోజులు చాటింగ్ చేసి పెళ్లి చేసుకుంటానని హమీ ఇచ్చాడు. మొత్తం వారం రోజుల్లో ఆమెతో పెళ్లికి అంగీకరింప చేసి అనంతరం తన ప్రతాపం చూపించాడు.

పెళ్లి చేసుకుంటానని హామీ
వారం రోజులు ఉద్యోగితో చాట్ చేసిన అనంతరం తాను ప్రస్తుతం తన వద్ద పనిచేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన డబ్బులు కూడ పోగొట్టుకున్నాడని , అయితే కార్మికుడి కుటుంబానికి కొంత డబ్బు అత్యవసరమని నమ్మబలికాడు. అతని భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుందని చెప్పాడు. అయితే తాను డబ్బులు పంపేందుకు సిద్దంగా ఉన్న విదేశీ కరెన్సీ కావడంతో కొంత ఆలస్యం అయ్యో అవకాశాలు ఉన్నాయని నమ్మించాడు. దీంతో కార్మికుడి కుటుంబానికి ప్రస్తుతం కార్మికుడి కుటుంబానికి 37 వేల రూపాయలు కావాలని అడిగాడు. అయితే ఆ డబ్బులు కూడ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న వైద్యుడికే డబ్బులు పంపాలని కోరాడు. దీంతో స్పందించిన బాధితురాలు వెంటనే ఆ అక్కౌంట్కు డబ్బులు పంపింది.

డబ్బుల కోసం మాయమాటలు
ఈ నేపథ్యంలోనే మరోసారి నిర్మాణాల కోసం డబ్బులు కావాలంటూ నాలుగు లక్షల రూపాయలు అడిగాడు. అయితే తన వద్ద లేవని చెప్పిన బాధితురాలు మరోసారి 60 వేల రూపాయలను డిపాజిట్ చేసింది. సీన్ సీరియస్ చేసిన నేరగాడు తన కోసమే ఇండియా వస్తున్నాని చెప్పాడు. ఇండియాకు చేరుకున్నాక తనకు ఒక బహుమతి కూడ ఇస్తానని కూల్గా చెప్పాడు. ఇందుకోసం దుబాయి నుండి ముంబయి వస్తున్నట్టు ఓ టికెట్ను వాట్సప్లో పెట్టాడు. అక్కడే తన డ్రామాను ప్లే చేశాడు.

కోట్లు ఉన్నాయి...లక్షలు కావాలని ఫోన్
ఆ మరుసటి రోజే... ముంబయి నుండి బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది. వారు కస్టమ్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. నిందితుడు జోషి వద్ద విదేశీ కరెన్సీ ఉందని , నగదు రూపంలో విదేశీ కరెన్సీని తీసుకురావద్దని అలా చేస్తే నేరమని ఫోన్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు. దీంతో సీన్ను కంటీన్యూ చేసిన జోషి, తన కోసం కోట్ల రూపాలయను తీసుకువస్తున్నానని కాని కస్టమ్ అధికారులు పట్టుకున్నారని, ఆ డబ్బును విడుదల చేయాలంటే కస్టమ్ అధికారులకు పది లక్షల రూపాయలు పంపాలని చెప్పాడు. దీంతో నమ్మిన బాదితురాలు వెంటనే లక్ష రూపాయలను పంపింది. దీంతో ఆగకుండా నిందితుడు మిగిలి తొమ్మిది లక్షలను కూడ పంపించాలని అడిగాడు.

మోసాన్ని గ్రహించి ఫిర్యాదు చేసిన బాధితురాలు
అన్నిసార్లు మోసపోయిన తర్వాత తేరుకున్న బాధితురాలు అప్పుడు స్పందించింది. తాను మోసపోయినట్టు గుర్తించింది. కోట్ల రూపాయలు తీసుకువచ్చేవాడు. అది కూడ విదేశాల్లో ఉంటూ వ్యాపారం చేసేవాడు డబ్బులు లేకుండా ఎలా ఉంటాడు. అదికూడ ముంబయికి వచ్చి తనకు ఫోన్ చేయడం ఏంటనే ఆలోచనతో తేరుకుంది. ఆ వెంటనే మంగళవారం నాడు సిటి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్తో పాటు, బ్యాంక్ ఖాతాలను పరీశీస్తున్నారు. వాటిని బట్టి నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications