రెండురోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ: భానుడి భగ భగలతో అల్లాడుతున్న జనం
భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచే భగ భగల సెగలు మొదలవుతున్నాయి. అవీ రాత్రి వరకు అలానే కంటిన్యూ అవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిల లాడుతున్నారు.
రాజధాని హైదరాబాద్లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు, నిజామాబాద్ 42.2, రామగుండం 41.4, హనుమకొండ 41, మహబూబ్ నగర్ లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రెండు రోజులు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ ఈ చిరుజల్లుల వల్ల భూమి వేడి తగ్గడం లేదు. ఆ తర్వాత మరింత ఉక్కపోత ఉంటుంది. దీంతో ప్రజలు చెట్లు, తోటల మాటున సేదతీరుతున్నారు. పట్టణం/ నగరాల్లో అయితే చలువ కోసం కూలర్లు, ఏసీల వినియోగం మరింత పెరిగింది. పని ఉన్నవారు ఉదయం 9 గంటల లోపు.. సాయంత్రం 5 దాటిన తర్వాతే బయటకు వస్తున్నారు.
ఈ సారి రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో నెలరోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నైరుతి రుతు పవనాల రాకతో వాతావరణం చల్లబడుతుంది. అప్పటివరకు ఎండల తీవ్రత ఉంటుంది. అయితే ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు మాత్రం జూన్ 22 నుంచి ఫోర్త్ వేవ్ ఉంటుందని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇదీ కాస్త భయాందోళన కలిగించే అంశంగా మారింది.ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో అంత ప్రభావం ఏమీ లేదు. భవిష్యత్లో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications