కేసీఆర్ నీరో చక్రవర్తి.. బండి సంజయ్ ఏకిపారేశారుగా.. పార్లమెంట్లో తొలి స్పీచ్
హైదరాబాద్ : పార్లమెంట్ వేదికగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తొలి స్పీచ్తో అదరగొట్టారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా ఆయన మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. కేసీఆర్ను నీరో చక్రవర్తిగా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్లక్ష్యం వహించారంటూ ధ్వజమెత్తారు. లోక్ సభలో బండి సంజయ్కు ఇదే తొలి స్పీచ్ అయినప్పనటికీ.. చాలా చక్కగా మాట్లాడారనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

టార్గెట్ కేసీఆర్.. జీరో అవర్లో బండి సంజయ్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్సభలో తొలిసారిగా మాట్లాడారు. జీరో అవర్ సమయంలో రాష్ట్రంలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ.. విద్యను కమర్షియల్ యాంగిల్లో చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో నీరో చక్రవర్తిలా కేసీఆర్ పాలన సాగుతోందని అభివర్ణించారు.
కేసీఆర్ తీరుతో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని వ్యాఖ్యానించిన బండి సంజయ్.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆయన స్పందించకపోవడం దారుణమన్నారు. ముమ్మాటికీ కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే 27 మంది ఇంటర్ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.

నైతికత లేదు.. బాధ్యులపై చర్యలేవీ..!
ప్రభుత్వ సంస్థలతో నిర్వహించిన పనులను కాసుల కక్కుర్తి కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని ఆరోపించారు. ఇంటర్మీడియట్ ఫలితాలను కంప్యూటరీకరణ చేసే క్రమంలో అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు పనులు అప్పగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నైతికత లేకుండా, విలువలకు తిలోదకాలు ఇచ్చి.. ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమయ్యారని ధ్వజమెత్తారు.
9 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే.. అందులో 3 లక్షల మంది ఫెయిల్ కావడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని కోరారు.

వాళ్లకేమో టైమ్ ఇస్తారు.. ఇతర సంఘటనలు కనిపించడం లేదా..!
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంటోందని వ్యాఖ్యానించారు. పెద్దింటివారు చనిపోతే టైమ్ తీసుకుని వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించే ఓపిక ఉన్న కేసీఆర్కు.. రాష్ట్రంలో జరిగే ఇతర సంఘటనలు కనిపించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాత్రం ఆయనకు సమయం లేకపోయిందని మండిపడ్డారు.
ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications