ఫాంహౌస్ కలలు! కేసీఆర్ ప్రధాని, కవిత కేంద్రమంత్రి, కేటీఆర్ సీఎం అంటూ కిషన్ సెటైర్లు
హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు చేసే పనిలో ఉన్న టీఆర్ఆర్ అధినేత, సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కొత్త నాటకమాడుతున్నారని విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
మజ్లిస్ కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కిషన్ ఫైర్
మజ్లిస్ బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఏ పార్టీ.. ఇప్పటి వరకు ప్రపంచంలో మనుగడ సాధించలేదని అన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఆ పార్టీకి మిగిలిన ఏకైక మిత్రపక్షం మజ్లిస్ మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.ప్రగతిభవన్ కు అసదుద్దీన్ ఒవైసీ బుల్లెట్ మీద నేరుగా వెళ్తారని అన్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ అందుకేనంటూ కిషన్ విమర్శలు
కల్వకుంట్ల కుటంబం అంధకారంలోకి పోతోందన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారన్నారు. జాతీయ పార్టీ మీద తప్ప.. టీఆర్ఎస్ వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేది కేసీఆర్ ఆలోచన అని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలకే తెలియదని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. బీజేపీని గద్దె దించుతామంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విపక్షాల నేతలెవరూ కేసీఆర్ను నమ్మడం లేదన్నారు.
కేసీఆర్ ఫాంహౌస్ కలలంటూ కిషన్ రెడ్డి సెటైర్లు
కేసీఆర్ ప్రధాని కావాలని ఫాంహౌస్లో కలలు కంటున్నారని.. ఆయన కూతురు కవిత కేంద్రమంత్రి, కేటీఆర్ తెలంగాణ సీఎం అయినట్లు కలలు కంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ఇప్పుడున్న 8 సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు? అంటూ నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.