సుర్రుమంటున్న సూరీడు.. భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలు
Recommended Video
సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు.
నిజామాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత
వారం రోజులుగా భానుడు ఉగ్రరూపం చూపుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం నిజామాబాద్లో సీజన్లోనే అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 42, మెదక్లో 41.6, రామగుండంలో 41.2, మహబూబ్నగర్, హన్మకొండలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భద్రాచలం, హైదరాబాద్, నిజామాబాద్లలో అత్యధికంగా 27 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువ రికార్డైంది. సాధారణ ఉష్ణోగ్రతలు మరో 4 డిగ్రీల వరకు పెరగొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
సూర్యతాపానికి జనం బెంబేలు
సూర్యుడి భగభగలకు జనం ఇంటి నుంచి బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. ఉదయం ఏడున్నర నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తూ జనానికి చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతుండటంతో రద్దీగా ఉండే రోడ్లు సైతం ఖాళీగా కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు, ఏడు దాటినా వేడి గాలుల నుంచి జనానికి ఉపశమనం లభించడం లేదు. రాత్రి వేళల్లోను వడగాలులు వీస్తుండటంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ఎండలు మండిపోతుండటంతో జనం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలే అవకాశమున్నందున ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడం ఉత్తమమని అంటున్నారు. వీలైతే పనులను సాయంత్రానికి వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. చెమట కారణంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశమున్నందున వీలైనంత ఎక్కువ నీరు తీసుకోవాలని చెబుతున్నారు. జ్యూస్లు, కూల్ డ్రింక్లకు బదులు మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు.