అరవింద్! ఇదేం పద్ధతి!! బండి సంజయ్పై వ్యాఖ్యలకు రాజా సింగ్ హితవు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే రాజా సింగ్.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల దుమారం
బండి సంజయ్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి. అంతకుముందు బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో.. పోలీసు కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కవితపై చేసిన వ్యాఖ్యలకు గానూ బండి సంజయ్కు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

బండి సంజయ్పై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ఇది ఇలావుంటే, బండి సంజయ్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించనని.. ఆయన ఆ మాటలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అన్నారు. అంతేగాక, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. సామెతలను జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే హోదా అని.. పవర్ సెంటర్ కాదని ఘాటుగా స్పందించారు.

బండిపై అరవింద్ వ్యాఖ్యలు సరికాదంటూ రాజా సింగ్ హితవు
ఈ నేపథ్యంలో మరికొందరు బీజేపీ నేతలు బండి సంజయ్ వ్యాఖ్యలు, అరవింద్ స్పందనపై మాట్లాడారు. బండి సంజయ్ పై అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడని.. ఏది మాట్లాడాలి.. ఏది మాట్లాడకూడదనే అవగాహన అతనికి ఉందన్నారు. ఎంపీ అరవింద్ ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది. అరవింద్ కు సంజయ్ తో ఇబ్బంది ఉంటే నేరుగా మాట్లాడాలి. ఇద్దరు ఎంపీలే కదా.. ఢిల్లీలో కలిసి మాట్లాడుకోవాలి. మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేయడం తప్పు అని అన్నారు. అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు రాజా సింగ్ తెలిపారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా బండి సంజయ్ పై అరవింద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడాలని.. ఇలా బహిరంగంగా స్పందించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications