గోల్డ్ స్మగ్లింగ్లో కొత్త ట్విస్ట్.. ఆ యాత్రికులు బలవుతున్నారా?
హైదరాబాద్ : అరబ్ దేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ జోరందుకుందా? యాత్రికులను బెదిరిస్తూ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారా? ఆ దేశాల నుంచి బంగారం భారత్కు తరలిస్తూ కోట్లు కూడబెడుతున్నారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటం గమనార్హం. అధికారులకు చిక్కకుండా అడ్డదారుల్లో కిలోలకొద్దీ బంగారాన్ని ఏడు సముద్రాలు దాటించేస్తున్నారు.

స్మగ్లింగ్ ముఠాల కొత్త పంథా..!
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేసే స్మగ్లింగ్ ముఠాలు కొత్త పంథా ఎంచుకుంటున్నాయి. ప్రయాణీకులను మభ్యపెట్టి, వినకుంటే భయపెట్టి యధేచ్ఛగా గోల్డ్ స్మగ్లింగ్ కొనసాగిస్తున్నాయి. డీఆర్ఐ, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి గుట్టుగా కిలోలకొద్దీ బంగారాన్ని దేశాలు దాటిస్తున్నాయి. అయితే స్మగ్లర్ల ఆటలకు చెక్ పెట్టేలా శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు విస్తృతం చేయడంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది.
ఇటీవల డీఆర్ఐ అధికారులు, సిటీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో కిలోలకొద్దీ బంగారం పట్టుబడింది. అరబ్ కంట్రీ నుంచి వచ్చిన 14 మంది ప్రయాణీకుల నుంచి 2 కోట్లకు పైగా విలువచేసే 6 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకోవడం చర్చానీయాంశమైంది.

గల్ఫ్ బంగారానికి డిమాండ్.. అందుకే..!
గల్ఫ్ బంగారానికి మన దేశంలో డిమాండ్ ఉండటంతో ఇక్కడ అధిక ధర పలుకుతోంది. దాంతో అక్కడ తక్కువ ధరకు కొన్న బంగారాన్ని అక్రమ మార్గంలో దేశం దాటిస్తున్నారు. అలా ఇక్కడకొచ్చాక అధిక ధరలకు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు.
మక్కా యాత్రకు వెళుతున్న కొందరు ప్రయాణీకులే టార్గెట్గా స్మగ్లింగ్ ముఠా సభ్యులు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అమాయక టూరిస్టులకు గాలం వేస్తూ అక్రమ బంగారం రవాణా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. నామినల్ ఛార్జీలకే మక్కా యాత్రకు ప్యాకేజీలు ప్రకటిస్తూ.. తీరా వారు అక్కడకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు ట్రావెల్స్ నిర్వాహకులు అసలు కథ వినిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

యాత్రికులను బెదిరిస్తూ.. దొంగ బంగారం దాటిస్తూ..!
మక్కా యాత్రకు వెళ్లాలనుకునే పేదోళ్ల కోరికను అవకాశంగా చేసుకుంటున్నారు స్మగ్లర్లు. అలా వారిని ఊరిస్తూ.. తక్కువ ధరలకే ఉమ్రా యాత్రకు తీసుకెళ్తామని మభ్యపెడుతున్నారు. అయితే యాత్ర ముగించుకుని తిరిగి ఇండియాకు వచ్చే క్రమంలో దొంగ బంగారాన్ని తమ వెంట తీసుకెళ్లాలని బెదిరిస్తున్నారట. ఒకవేళ వారు చెప్పినట్లు వినకపోతే తాము పెట్టిన ప్రయాణ ఖర్చులు పూర్తిగా చెల్లించాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారట. అలా యాత్రికులతో అక్రమ బంగారం దేశం దాటిస్తున్నారు. ఇక్కడేమో వారి ముఠా సభ్యులు కలెక్ట్ చేసుకుంటున్నారు.

అనధికార ట్రావెల్స్ నిర్వాహకులే..!
హైదరాబాద్ నుంచి ఉమ్రాకు పెద్దసంఖ్యలో యాత్రికులు వెళుతుంటారు. ఆ యాత్రకు పంపించేలా తగిన ఏర్పాట్లు చేయడానికి దాదాపు 40 ట్రావెల్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అయితే అన్ అఫిషయల్గా మరో వంద రెండు వందల వరకు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైతే అనధికారంగా ట్రావెల్స్ నిర్వహిస్తున్నారో వాళ్లే అక్రమ బంగారం రవాణాకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జెడ్డా విమానాశ్రయంలో వృద్ధులు, మహిళలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది. ఆ క్రమంలో వారికి మక్కా యాత్ర వెళ్లేందుకు ఆఫర్లు ఇస్తూ వచ్చేటప్పుడు మాత్రం దొంగ బంగారం ఇండియాకు తీసుకెళ్లేలా ఫోర్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications