టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్..!! 25 వరకు డెడ్లైన్
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగబోతుంది. ఇప్పటికే నాలుగు యూనియన్లు నోటీసులు ఇవ్వగా .. ఇవాళ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సమ్మె చేస్తామని యూనియన్ నాయకులు స్పష్టంచేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని .. అందుకే సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నట్టు యూనియన్ లీడర్లు మీడియాకు తెలిపారు.

సమ్మె సైరన్
టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతుంది. ఈ నెల 25వ తేదీ తర్వాత సమ్మె చేపడుతామని యూనియన్ నేతలు ప్రకటించారు. ఇప్పటికే నాలుగు యూనియన్లు నోటీసులు ఇవ్వగా .. ఇవాళ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు టీఎంయూ నోటీసులు అందజేసింది. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎంయూ నేతలు డిమాండ్ చేశారు. విలీనం చేస్తామని హామీనిచ్చి సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

ఇవీ డిమాండ్లు ..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఐఆర్, డీఆర్ వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని వివరించారు. రూ.5 వేల కోట్ల పైచిలుకు నష్టాలతో ఉందని తెలిపారు. నష్టాలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్టీసీలో 7 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. కొత్తగా ఉద్యోగాలను నియమించడం లేదని .. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందన్నారు. కానీ కార్మికుల సమస్యలను కార్పొరేషన్ పట్టించుకోవడం లేదన్నారు.

పరిష్కారం కోసం ..
ఆర్టీసీ సమ్మె నోటీసుతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్షించారు. తర్వాత బస్ భవన్లో ఆర్టీసీ ఎండీతో కలిసి కార్మిక సంఘ నేతలను కలిశారు. కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications