మునుగోడు బ్యాలెట్ పేపర్ నమూనాపై రేవంత్ రెడ్డి అభ్యంతరం, మార్చాలని డిమాండ్
మునుగోడు బై పోల్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. బ్యాలెట్ పేపర్ రూపొందించింది. అయితే దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు కారణం.. రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉండటమే. బ్యాలెట్ పేపర్ మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
మునుగోడు బ్యాలెట్ పేపర్ నమూనాను రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. మొదటి స్థానంలో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి ఉండగా... రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాలుగో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఉన్నారు. బ్యాలెట్ పేపర్ కూర్పుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారం జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ముందు ఉండాలని, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఎస్పీ అభ్యర్థి తర్వాతి స్థానంలో బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉండాలని అంటున్నారు.
ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు నాలుగో స్థానంలో ఉండాలన్నారు. అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ అభ్యర్థి పేరును రెండో స్థానంలో ఎలా పెడతారని ప్రశ్నించారు. నిబంధనలను మరోమారు పరిశీలించి టీఆర్ఎస్ అభ్యర్థి పేరును నాలుగో స్థానానికి మార్చాలని కోరారు.