500 కోట్లు ఎవరికి చెల్లిద్దాం?.. మంత్రి, ఆర్టీసీ ఎండీ మధ్య కుదరని సయోధ్య
టీఎస్ ఆర్టీసీ.. లాభల సంగతి దేవుడు ఎరుగు.. నష్టాలే మూటగట్టుకుంది. సంస్థను నమ్ముకొని ఉన్న ఉద్యోగులు, ప్రయాణికుల సౌలభ్యం కోసం రవాణా కొనసాగుతోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయి.. బకాయిల చెల్లింపుల కోసం ఇబ్బంది పడుతున్న ఆర్టీసీకి కాస్త ఉపశమనంగా బ్యాంకు నుంచి రుణం వచ్చింది. అయితే ఆ నిధుల సర్దుబాటు విషయంలో రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఆర్టీసీకి వేయి కోట్ల రుణం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా.. పలు బ్యాంకులు తిరస్కరించాయి.

రూ.500 కోట్లు..
నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీకి రుణ సాయం చేయలేమని తెగేసీ చెప్పాయి. ఆర్టీసీ అధికారులు పలుసార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత కేవలం రూ.500 కోట్ల రుణం ఇవ్వడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. జూలై రెండో వారంలో నిధులను కూడా విడుదల చేసింది.
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండడంతో రుణంగా వచ్చిన నిధుల చెల్లింపులు ఇంతవరకూ చేపట్టలేదు. ఈ నెల 10వ తేదీ నుంచి ఎండీ విధులకు హాజరవుతారు. తమ బకాయిలు ముందుగా చెల్లించాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అద్దె బస్సుల యజమానులతోపాటు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకీ చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది.

ఇదీ లెక్క
ఆయిల్ కంపెనీలకు సుమారూ. 85 కోట్లు, అద్దె బస్సుల యజమానులకు సుమారు 65 కోట్లు, సీసీఎస్కు రూ.1080 కోట్ల బకాయిలను ఆర్టీసీ తక్షణం చెల్లించాల్సి ఉంది. ఇతర సంస్థలకూ అత్యవసరంగా మరో 100 కోట్ల వరకు బకాయిలను చెల్లించాల్సి ఉందని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో హామీ ఇచ్చినట్టు ఆయిల్ కంపెనీల బకాయిలు, అద్దె బస్సుల యజమానులకు, సీసీఎ్సకు సుమారు 250 కోట్లు చెల్లించి సర్దుబాటు చేయడానికి ఆర్టీసీ ఎండీ ప్రయత్నించినట్టు తెలిసింది.
అయితే నిధుల చెల్లింపుపై రవాణా శాఖ మంత్రి మరో ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిమితంగా ఉన్న రూ. 500 కోట్ల నిధులను ఎవరెవరికి ఎలా సర్దుబాటు చేయాలో సూచించాల్సిందిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాని ఆర్టీసీ ఎండీ నిర్ణయించినట్టు సమాచారం.

కేసీఆర్ ఇలా..
సీఎం కేసీఆర్ సమయం ఇవ్వకపోవడంతో బకాయిలు చెల్లింపుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 500 కోట్లను మూడు వారాలుగా వినియోగించుకుండా ఉండటంతో ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి అనవరసంగా వడ్డీ భారం పెరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సుమారు రూ.4500 కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. సీసీఎస్కు బకాయి చెల్లించి ఉద్యోగుల ఇబ్బందులను తొలగించాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కే రాజిరెడ్డి, వైఎస్ చైర్మన్ కే హన్మంత్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఇబ్బందులు
సీసీఎస్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రుణాలు దొరకక, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, డిపాజిట్దారులకు నెలనెలా రావాల్సిన వాయిదాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రతినెలా జమ చేసుకునే పొదుపు మొత్తాలపై రుణాలను అందించి అండగా నిలిచే క్రెడిట్ కోఆపనేటివ్ సొసైటీకి చెందిన బ్యాంకు ఖాతాను నిలిపివేశారు.
ఆ ఖాతాను నిర్వహించే ఒక ప్రభుత్వ బ్యాంకు ప్రకటించింది. తీసుకున్న రుణాలకు సంబంధించి నాలుగు నెలలుగా వాయిదాలు చెల్లించడం లేదని, దీంతో సీసీఎస్ను ఎగవేతదారుగా పరిగణించి సదరు బ్యాంకు అధికారులు ఖాతాను నిలిపేశారు.
దీంతో ఇప్పటికే సకాలంలో వేతనాలు అందక ఇబ్బందిపడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. సీసీఎస్/ సంబంధించిన సుమారు రూ.1080 కోట్ల నిధులను ఆర్టీసీ యాజమాన్యం దారి మళ్లించడంతో ఉద్యోగులకు ఆర్ధిక సాయం అందని పరిస్థితి ఏర్పడింది.

ఆందోళనలు..
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టారు. సకల జనుల సమ్మెలో తీవ్ర పోరాటం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆడపా దడపా సమ్మె చేశారు. కానీ ఏడాది క్రితం చేసిన సమ్మె మాత్రం.. యూనియన్ నేతల పట్ల వ్యతిరేక స్వరం వినిపించింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా మారారు.
యూనియన్ ఏకాకిగా మారాల్సిన సిచుయేషన్ ఏర్పడింది. ఆర్టీసీకి ఎప్పుడూ నష్టాలు, అప్పులే మిగిలాయి. వివిధ కారణాలతో సంస్థ అప్పుల్లోకి నెట్టవేయబడింది. ప్రభుత్వ వాదన మాత్రం లాభాల్లోకి వస్తోందని చెబుతారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దీనికితోడు ప్రభుత్వ గ్యారంటీ తీసుకున్న రూ.500 కోట్ల చెల్లింపులపై కూడా స్పష్టత లేకుండా పోయింది.

చివరికీ ఇలా
గత సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు. సమ్మె చేసిన తర్వాత కూడా విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. పాలాభిషేకాలు కూడా చేశారు. యూనియన్ నేతలు మాత్రం కొందరు ఏకాకి అయ్యారు. వారు సొంతంగా ఆస్తులను కూడబెట్టుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మరుగున పడ్డాయి. కానీ ఉద్యోగులు మాత్రం చక్కగా డ్యూటీ చేస్తున్నారు. అప్పులు పెరగడం వారికి మింగుడుపడని విషయం. సంస్థకు ఉన్న ఆస్తులను అమ్మి.. కడతామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications