మంత్రి ఇలాకాలో టీఆర్ఎస్ కు షాక్ .. ధర్మపురిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఫలితాలు
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నా కొందరు మంత్రుల ఇలాకాలో మాత్రం టీఆర్ఎస్ కు ఒకింత భంగపాటు తప్పటం లేదు . జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న చందంగా పోటీ కొనసాగింది. మంత్రి ఇలాకాలోనే వచ్చిన ఈ ఫలితాలు టీఆర్ఎస్ కు ఒకింత షాకింగ్ ఫలితాలే అని చెప్పొచ్చు .
లైవ్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, పెద్దపల్లి మున్సిపాలిటీతో టీఆర్ఎస్ బోణీ
ధర్మపురి మునిసిపాలిటీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఫైటింగ్ గట్టిగానే సాగింది. విజయం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ తమ పట్టు చూపించింది. మొత్తం 15 వార్డుల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7వార్డుల్లో గెలుపొందాయి. కేవలం ఒక్క వార్డులో ఆధిక్యాన్ని ప్రదర్శించిన టీఆర్ఎస్ చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడింది. ధర్మపురి నుంచే మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయినప్పటికీ సాక్షాత్తు మంత్రి ఇలాకాలో వచ్చిన ఫలితం టీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి అన్న సంకేతాలు ఇచ్చింది . మొత్తానికి కేవలం ఒక్కవార్డు తేడాతో అతి కష్టం మీద టీఆర్ఎస్ ధర్మపురి మునిసిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక దీంతో నంబర్ గేమ్ మొదలైందని చెప్పాలి . గెలిచిన ఇద్దరిని తమవైపు ఆకర్షించేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థులు మాత్రం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పార్టీ నేతలకు టెన్షన్ పెడుతున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల్లో ఎలాగైనా మున్సిపాలిటీ చైర్మన్ గా తమవారే అవకాశం దక్కించుకోవాలని విఫలయత్నాలు చేస్తున్నారు.