పొలాలు పచ్చగా ఉంటే కళ్లు మండుతున్నాయా.. కేటీఆర్ చురకలు..!
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఒకప్పటి మాటలా కనిపిస్తోంది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని చూసిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎత్తుగడ ఫలించినట్లైంది. ఆ క్రమంలో హస్తం గుర్తుపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం కొందరిని కారెక్కించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అనే మాట లేకుండా చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ శ్రేణులు లైట్గా తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాటల యుద్దానికి దిగుతుండటంతో గులాబీవనంలో ఆందోళన మొదలైనట్లు తయారైంది పరిస్థితి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

కాంగ్రెస్ నేతల చుట్టే..!
నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలను పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్ నేతలు తిరిగి వారిపై మాటల యుద్దానికి దిగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మాకు కాంగ్రెస్ పోటీయే కాదంటూ, ప్రత్యామ్నాయం అస్సలు కాదంటూ బీరాలు పలికిన గులాబీ దండు మళ్లీ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండటం చర్చానీయాంశమైంది. ఇటీవల ప్రాజెక్టులపై పోరాటం సాగిస్తామని కాంగ్రెస్ నేతలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుండటం టీఆర్ఎస్ నేతల కళ్లు తెరిపించాయనే వాదనలు లేకపోలేదు. అందుకే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలను అంత పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్ నేతలు వారిపై మళ్లీ మాటల తూటాలు పేలుస్తున్నారు.
Recommended Video

పొలాలు పచ్చగా ఉంటే కళ్లు మండిపోతున్నాయా?
పొలాలు పచ్చగా కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లు మండిపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ లీడర్ల తీరును ఎండగట్టారు.
హస్తం గూటి నుంచి నేతలు ఇతర పార్టీల వైపు మళ్లుతున్నా.. ఆ పార్టీ పెద్దలకు చీమకుట్టినట్లైనా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేకనే ఆ పార్టీ నేతలు జంప్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పినప్పటికీ వారిలో మార్పు రాకపోవడం శోచనీయం అన్నారు.

నీటి కొట్లాటలు లేవు.. కరెంట్ కష్టాలు లేవు
దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు కేటీఆర్. కేవలం పింఛన్లు ఇవ్వడానికే ప్రతి సంవత్సరం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 200 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్లతో 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో నీటి కొట్లాటలతో జలమండలి కార్యాలయం దగ్గర చాలా సీన్లు కనిపించేవని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. హైదరాబాద్లో తాగునీటి సమస్య పరిష్కరించిన ఘనత నూటికి నూరుపాళ్లు కేసీఆర్కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో 24 గంటల విద్యుత్ ఎవరి హయాంలో ఇంప్లిమెంట్ అవుతుందో అందరికి తెలుసన్నారు.

ముందుచూపుతోనే ప్రాజెక్టులు కడుతూ..!
ముందుచూపుతోనే కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్కు నీటి కష్టాలు రాకుండా కృష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఢోకా లేదన్నారు. కేసీఆర్ దూరదృష్టి వల్లే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయని చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమం పట్ల ఫుల్ క్లారిటీ ఉన్న టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కాదు కదా ఎవరూ కూడా ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications