సిద్దాంతాలు, ఆశయాలు లేవు.. అందుకే మహారాష్ట్రలో ఇలా, సంక్షోభంపై విజయశాంతి
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతుంది. షిండేకు శివసేన ఆఫర్ కూడా చేస్తోంది. ఎమ్మెల్యేలు తిరిగి వస్తే కూటమి నుంచి బయటకు వస్తామని కూడా చెప్పింది. ఇదిలా ఉంటే ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయశాంతి సంక్షోభంపై స్పందించారు. సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని కామెంట్ చేశారు.
బాల్ థాకరే ఆశయాలు..
హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఉద్ధవ్ తండ్రి బాల్ థాకరే శివసేన పార్టీ స్థాపించారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేనలో జరిగిన పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదన్నారు. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు.
ఏ పార్టీకి మెజార్టీ ఉంటే..?
పొత్తులు, సంకీర్ణ సర్కార్లపై బాల్ థాకరే ఉటంకించిన విషయాలను పేర్కొన్నారు. ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కార్కు నేతృత్వం వహించాలని చెప్పారని విజయశాంతి గుర్తుచేశారు. కానీ ఉద్ధవ్ థాకరే ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతో చేతులు కలిపారని వివరించారు. చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారని తెలిపారు.
సొంత పార్టీ వారే తిరుగుబాటు
చివరికి సొంత పార్టీవారే తిరుగుబాటు చేయగా... దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్ధవ్ థాకరేకు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో.. చివరికి ఏక్నాథ్ షిండే నాయకత్వంలో రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని విజయశాంతి తెలిపారు.
42 మంది ఎమ్మెల్యేలు
మహారాష్ట్రలో శివసేన నేత, మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు ఎగరవేశారు. తొలుత 21 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్ వెళ్లారు. ఇప్పుడు ఆ సంఖ్య 42కి చేరింది. ఏక్నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అదీ ఇప్పుడు బయటపడింది. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావించారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలో ఈ పరిణామం జరిగింది.