సరైన దిశలోనే ఈటల పయనం.. రాములమ్మ విజయశాంతి అభయం..
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. దీంతో ఇతర పార్టీ నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన దిశగా వెళుతున్నారని, మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇవాళ టీఆర్ఎస్ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా బీజేపీకి మాత్రమే ఉందనేది తిరుగులేని వాస్తవం అని అభివర్ణించారు.

సరైన మార్గంలోనే..
కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్న భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితం అయ్యిందని తెలిపారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్ రెండూ బీజేపీతోనే నిలబడతాయనేది స్పష్టమైన నిజం అని విజయశాంతి పేర్కొన్నారు. మరోవైపు హై కమాండ్ వద్ద ఈటల రాజేందర్ పలు ప్రశ్నలు లెవనేత్తినట్టు తెలుస్తోంది.

ఈటల సందేహాలు ఇవీ..
ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని ఈటల అన్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత అవే పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఆయుష్మాన్ భారత్.. అయితే భవిష్యత్తులో టీఆర్ఎస్ - బీజేపి పొత్తు పెట్టుకుంటే బీజేపీనే నమ్ముకొని వచ్చిన మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఈటెల లేవనెత్తినట్టుగా సమాచారం.

విచారణ జరపలే..
టీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ కేంద్రం ఒక్క విచారణను కూడా జరపడం లేదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని ఈటల కామెంట్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై స్పందించిన జేపీ నడ్డా సరైన సమయంలో టీఆర్ఎస్ అక్రమాల పై స్పందిస్తామని అన్నట్టుగా సమాచారం.
Recommended Video

పాగా వేయడం ఖాయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ఈటెలతో అన్నట్టుగా సమాచారం. పార్టీలో చేరక పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని, పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఈటల రాజేందర్కి జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికపై ఈటల రాజేందర్ ఈ వారం లోపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications