షర్మిల టెర్రరిస్టా- ఎంతకాలం నిర్బంధించగలుగుతారు?: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోటస్పాండ్ వద్ద గల నివాసం వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్కు చేరుకున్నారు. దీనితో లోటస్ పాండ్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిట్ కార్యాలయానికి బయలుదేరిన ఆమెను లోటస్ పాండ్ నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను కారు ఎక్కనివ్వలేదు. దీనితో రోడ్డు మీదే నడుచుకుంటూ ప్రగతి భవన్ వైపు బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు చుట్టుముట్టారు. ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగులగొట్టారు.

షర్మిలను ఇంటికి పంపించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ కొలిక్కి రాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. తమ వాహనంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. షర్మిలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే బైఠాయించారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ కొద్దిసేపటికే షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు ఆమెను రోడ్డుపైనే అడ్డుకున్నారు. లోనికి రానివ్వలేదు. దీనితో ఆమె పోలీసులతో గొడవకు దిగారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విజయమ్మ పోలీసులను పక్కకు తోసేశారు. తన కుమార్తెను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వరా? అంటూ నిలదీశారు.
పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లోనికి విజయమ్మను వెళ్లనివ్వలేదు. వెనక్కి పంపించేశారు. లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్న తరువాత విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. పోలీసులను తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొడతానని అన్నారు. తోపులాట సందర్భంగా చెయ్యిని విదిలించానే తప్ప ఉద్దేశపూరకంగా వారిపై దాడి చేయలేదని చెప్పారు. పోలీసుల నుంచి విడిపించుకునే క్రమంలో జరిగిన తోపులాటను కొట్టినట్లు చూపడం సరికాదని అన్నారు.
ప్రజల కోసం పోరాడుతున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం షర్మిల రోడ్డెక్కట్లేదని, ప్రజల తరఫున పోరాడుతున్నారని చెప్పారు. సిట్ కార్యాలయానికి వెళ్లినంత మాత్రాన ఏమౌతుందని ప్రశ్నించారు. అక్కడ దాడులు ఏమైనా చేస్తుందా? అని ఎదురు ప్రశ్నలు వేశారు. షర్మిల టెర్రరిస్టు కాదు కదా? అని పేర్కొన్నారు.
ప్రజల కోసం 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిందని, ఓ ఆడపిల్లకు అది సాధ్యమయ్యే పనేనా అని విజయమ్మ చెప్పారు. ఆమె ఎవరికోసం పాదయాత్ర చేసిందనేది ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం పోరాడుతున్న గొంతును ఎంతకాలం అని అణచివేస్తారని, ఎంతకాలం షర్మిలను నిర్బంధించగలుగుతారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications