ఎబోలా వైరస్ ఎఫెక్ట్: 1400కి చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: ఎబోలా వైరస్కి గురైన మృతుల సంఖ్య 1400 వందలకి చేరింది. ఎబొలా వైరస్ని ఎదుర్కొనేందుకు దాదాపుగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎబొలా వ్యాధికి గురైన వారికి చేయూతనిచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు స్వచ్చంధ సంస్దలు ముందుకు వస్తున్నాయి.
బెల్జియం రాజధాని బ్రిస్సెల్స్లో వైద్య సిబ్బంది, స్వచ్చంధ సంస్దల కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎబొలా వైరస్ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఎంఎస్ఎఫ్ అనే ఎన్జీవో ఈ శిక్షణ ఇచ్చింది.
సుమారుగా 240 మంది వైద్య సిబ్బందికి ఎబొలా వైరస్ సోకినట్లు ఐక్యరాజ్య సమితి చెబుతుంది. వైద్యం చేసే సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంస్ద శిక్షణ ఇచ్చింది.
ఇది ఇలా ఉంటే టెక్సాస్లో రిలీఫ్ అన స్వచ్చంధ సంస్ద ఎబొలా బారిన పడిన దేశాలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రత్యేక విమానంలో అత్యవసర పరికరాలు, ఆహార పదార్దాలను లైబేరియా లాంటి పేద దేశాలకు పంపింది. ఎబొలా వైరస్ నుండి తప్పించుకునేందుకుగాను మాస్క్లు, గ్లౌజులు, దుస్తులు, మందులను తరలించింది. రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య కేంద్రాలకు ఇదే విధంగా పంపిణీ చేయనున్నట్లు ఆ సంస్ద పేర్కొంది.
నైజీరియా నుండి ఆదివారం ముంబైకి వచ్చిన 32 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వైరస్ సోకిందనే అనుమానంతో అతన్ని విమానాశ్రయం నుండి నేరుగా జోగేశ్వరిలోని ఓ ట్రామా కేర్ సెంటర్ కు తీసుకెళ్లి విడిగా ఉంచారు. అతని కళ్లు ఎర్రగా ఉండటంతో పాటు.. జలుబు, జ్వరంతో బాధ పడుతున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ విమానంలో నైజీరియా నుండి దుబాయ్ మీదగా ముంబైకి చేరుకున్నాడు. అతని రక్తనమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్దకు పంపనున్నట్లు వైద్యులు చెప్పారు.