జులై నాటికి రోజుకు కోటి వ్యాక్సిన్లు-లాక్ డౌన్ ఎత్తేసేందుకు ఆ మూడు కీలకం-ఐసీఎంఆర్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఈ ఏడాది జులై,అగస్టు నాటికి రోజుకు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ వెల్లడించారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని పేర్కొన్నారు. ఇంత భారీ జనాభా కలిగిన దేశానికి తగినన్ని వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసేందుకు సమయం పడుతుందని... ఇందుకోసం కొంత ఓపిక పట్టాల్సిందేనని చెప్పారు. టెస్టుల సంఖ్యను పెంచడం,కట్టడి చర్యలను పకడ్బందీగా అమలుచేయడంతో దేశంలో సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చిందన్నారు. అయితే కట్టడి చర్యలు స్థిరమైన పరిష్కార మార్గం కాదని అభిప్రాయపడ్డారు.
ఆ విషయం గమనించాలి : బలరాం భార్గవ్
'దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదు. నెల రోజుల్లోనే వ్యాక్సిన్ వేయించుకోవాలని మీరు భావిస్తే అలానే అనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... అమెరికా కంటే మన దేశ జనాభా నాలుగింతలు ఎక్కువ.కాబట్టి కాస్త ఓపిక అవసరం... ఈ ఏడాది జులైలో మధ్యలో లేదా అగస్టు మొదటి వారం నాటికి దేశంలో రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయి.' అని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ ఎత్తేసేందుకు ఆ 3 కీలకం..
దేశంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడం,కంటైన్మెంట్ చర్యలను పకడ్బందీగా అమలుచేస్తుండటంతోనే కేసుల సంఖ్య తగ్గిందన్నారు. లాక్ డౌన్ను ఎత్తివేయడం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. పాజిటివిటీ రేటు వారానికి 5 శాతం కన్నా తక్కువగా ఉండటం,కోవిడ్ బారినపడే రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో 70శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడం,లాక్ డౌన్ తర్వాత కూడా ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించడం... మూడింటి ఆధారంగా లాక్ డౌన్ను క్రమంగా ఎత్తివేయాలన్నారు. దేశంలో పలు రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో భార్గవ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Recommended Video
టీకాలపై గతంలోనే కేంద్రం వివరణ
దేశంలో గడిచిన 24 గంటల్లో 27.8లక్షల మందికి కోవిడ్ టీకాలు వేశారు. ఇప్పటివరకూ మొత్తంగా 23 కోట్ల డోసులు సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వ స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటివరకూ 21,51,48,659 డోసులు పంపిణీ చేయగా..ప్రస్తుతం మరో 1.57 కోట్ల డోసులు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి . కేంద్ర ఆరోగ్య శాఖ బ్లూ ప్రింట్ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది. డిసెంబర్ నాటికి 108 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ ఇస్తామని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశం భారత్ అని ఇటీవల కేంద్రమంత్రి జవదేకర్ ఒక సందర్భంలో పేర్కొన్నారు.