‘నన్ను సజీవ సమాధి చేసి గుడి కట్టండి’: 11ఏళ్ల బాలిక
ఆగ్రా: ఓ 11 ఏళ్ల బాలిక వింత నిర్ణయం తీసుకుంది. గ్రామ బాగు కోసం తనకి క్షీరాభిషేకం చేసి సజీవ సమాధి చేయవలసిందిగా కోరింది. ఆ సమాధిపై గుడి కడితే ఊరు బాగుపడుతుందని గ్రామస్థులకు సూచించింది. దీంతో గ్రామస్తులంతా ఆ పనికి పూనుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకుని, బాలికను కాపాడారు. బాలికను, ఆమె తల్లిదండ్రులని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, బాలిక తండ్రి.. పోలీసులకు పలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు.
తన కుమార్తెకు మూడేళ్ల వయసున్నప్పుడు గ్రామస్థులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురుకున్నారని, అప్పుడు ఆమె పంటపొలాల్లో ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేయగా వర్షాలు పడ్డాయని చెప్పారు.
ఆ తర్వాత ఎనిమిదేళ్లుగా బాలిక మౌనవ్రతం చేపట్టిందని, ఎప్పుడూ ప్రార్థిస్తూ గడిపేదని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా వారం రోజుల క్రితం ఒక కాగితం మీద రాసి ఈ సజీవసమాధి ఆకాంక్ష వెల్లడించిందని వివరించారు.
దీంతో గ్రామస్థులు ఆమెను చూడటానికి ఎగబడుతున్నారని, ఆమెకు గంగా జలం, పాలతో అభిషేకం చేస్తున్నారని తెలిపారు. అంతేగాక, పలువురు ఆమెకు గుడి కట్టించడానికి సిద్ధమైపోయారని పోలీసులకు చెప్పారు. సమయానికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో తమ కూతురు ప్రాణాలు దక్కాయని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.