11 ఏళ్ల అంధుడు టీవీ చానెల్ యాంకర్: ప్రపంచ రికార్డు
కోయంబత్తూరు: మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదని ఒక బాలుడు నిరూపించాడు. మొదటి సారి ప్రపంచ రికార్డు స్పృష్టించి భారతదేశం తల ఎత్తుకునే విధంగా చేశాడు. సాటి అంధులకు అతను ఒక ఆశాదీపంగా, మార్గ దర్శకుడిగా నిలిచాడు.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఉలియంపాళ్యంకు చెందిన శ్రీ రామానుజమ్ (11) అనే అంధ బాలుడు టీవీలో వార్తలు చదివి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పుట్టుకతోనే గుడ్డివాడైన శ్రీరామానుజమ్ ఉలియంపాళ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
ఇతను జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్నాడు. అందుకు మీడియా రంగాన్ని ఎంచుకున్నాడు. ప్రింట్ మీడియా అయితే కష్టం అనుకుని టీవీ చానెల్ లో న్యూస్ ప్రజెంటర్ కావాలని అనుకున్నాడు. కచ్చితంగా అవకాశం వస్తుందని ఎదురు చూశాడు.
తమిళనాడులోని లోటస్ న్యూస్ చానెల్ శ్రీరామానుజమ్ కు అవకాశం ఇచ్చింది. బ్రెయిలీ లిపి సహాయంతో నేపాల్ భూకంపం, ఆ తరువాత నేపాల్ లో జరిగిన పరిణామాలు, శ్రీలంక మహింద్రా రాజపక్సే ట్రయల్ తదితర వార్తలతో 22 నిమిషాల పాటు టీవీలో న్యూస్ బులిటెన్ ప్రజెంట్ చేశాడు.
మొదట రెండు మూడు నిమిషాలు తాను తడబడ్డానని, తరువాత అలవాటైయ్యిందని శ్రీరామానుజమ్ అంటున్నారు. టీవీ చానెల్ చెైర్మన్ జీకేఎస్. సెల్వకుమార్ పీటీఐతో మాట్లాడుతూ ప్రస్తుతానికి వారంలో ఒక బులిటెన్ ఇస్తామని, తరువాత ప్రతి రోజు వార్తలు చదవడానికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ప్రపంచంలో ఒక అంధుడి దగ్గర వార్తలు చదివించిన ఘనత తమ చానెల్ కు దక్కిందని సెల్వకుమార్ అంటున్నారు.