బాలికపై రేప్, సెక్స్ రాకెట్లో 5గురు యువతులు అరెస్ట్
లక్నో/జైపూర్: ఉత్తర ప్రదేశ్లో అరాచకాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా మరో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ముజఫర్ నగర్ జిల్లాలోని బరివాలా గ్రామంలో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైనట్లుగా పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన సోమవారం జరిగిందని వారు తెలిపారు.
బాధిత బాలిక తన ఇంటిలో ఉన్న సమయంలో నిందితుడు వచ్చి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితుడిని నదీంగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఈ అత్యాచారం విషయమై అతని పైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ఆరుగురి అరెస్టు
రాజస్థాన్లో సోమవారం ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసులు జైపూర్ - కోటా జాతీయ రహదారిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకొని రెయిడ్ చేశారు. ఇందుకు సంబంధించి సెక్స్ రాకెట్ నిర్వాహకుడితో పాటు ఐదుగురు యువతులను అరెస్టు చేశారు.
సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న రాజేంద్రను అరెస్టు చేశామని, అతనితో పాటు మరో ఐదుగురు మహిళలను అరెస్టు చేశామని డిప్యూటీ సూపరిండెండెంట్ ఆఫ్ పోలీసు సీమా హింగోనియా తెలిపారు. వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో తాము సోదాలు నిర్వహించామని సీమా తెలిపారు.
స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో ప్రధాన నిందితుడు, మహిళలు.. ఆరుగురి పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచామని, ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీకి తరలించామని డిప్యూటీ సూపరిండెండెంట్ ఆఫ్ పోలీసు సీమా హింగోనియా తెలిపారు.