యువతి కిడ్నాప్: మూడురోజులపాటు గ్యాంగ్రేప్ చేశారు
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి(18)ని అపహరించిన ఇద్దరు యువకులు, ఆమెపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పరిక్షిత్గర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి తన సోదరుడితో కలిసి బుధవారం తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఇద్దరు యువకులు సాజిద్, జుబర్ ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత లొహియా నగర్లోని ఓ ఖాళీ ఇంట్లోకి యువతిని తీసుకెళ్లి బంధించారు. ఆనాటి నుంచి ఆమెపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేగాక ఆ దారుణాన్ని నిందితులు వీడియో కూడా తీశారు. కాగా, నిందితులలో ఒకరి ఫోన్ నుంచి బాధిత యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల నుంచి యువతిని కాపాడారు. నిందితులలో సాజిద్ను అరెస్ట్ చేసిన పోలీసులు, జుబెర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.