లొకేషన్ ఛేంజ్: శివసేనకు జై కొడుతున్న మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: జైపూర్ లో భేటీ
ముంబై: మహారాష్ట్ర రాజకీయం ప్రస్తుతం రాజస్థాన్ కు షిఫ్ట్ అయింది. మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులందరూ ప్రస్తుతం పింక్ సిటీ జైపూర్ లో మకాం వేశారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా అనే అంశంపై కీలక సమవేశాన్ని నిర్వహిస్తున్నారు. జైపూర్ లోని బ్యూరావిస్టా రిసార్ట్ లో ఈ భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆత్మహత్యా సదృశ్యమౌతుందంటూ వ్యాఖ్యానించిన సంజయ్ నిరుపమ్ ఈ సమావేశానికి గైర్హాజర్ కావడం ఆసక్తి రేపుతోంది.

37 మంది ఎమ్మెల్యేలు శివసేన వైపే..
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 44 మంది సభ్యుల బలం ఉంది. వారిలో 37 మంది శివసేనతో పొత్తు పెట్టుకోవడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ గానీ, కూటమి గానీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.. రాష్ట్రపతి పాలను విధించడం ఖాయమని, అదే జరిగితే.. అందరి ఆశలు గల్లంతవుతాయని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి పాలనను విధించడానికి భారతీయ జనతాపార్టీ సైతం పావులు కదుపుతోందని అన్నారు. ఏ చిన్న అవకాశం లభించినా రాష్ట్రపతి పాలనను విధించడానికి సిఫారసు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రపతి పాలనను నివారించడానికి..
బీజేపీ వ్యూాహాలను తిప్పి కొట్టడానికి, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించాల్సి ఉందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని వారు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఒకరిద్దరు సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని, దానికి అనుగుణంగా శివసేనకు మద్దతు ఇవ్వడంపై నిర్ణయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

బీజేపీని ఎదుర్కొనడానికి శివసేన..
మహారాష్ట్రలో బీజేపీని ఎదుర్కొనడానికి శివసేనను ఓ ఆయుధంలా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు ఈ సమావేశంలో చెబుతున్నట్లు తెలుస్తోంది. పాతికేళ్లుగా కలిసి ఉన్నప్పటికీ.. శివసేన పట్ల బీజేపీ నాయకులు నియంతృత్వ ధోరణిలో వ్యవహరించారని, ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవడానికి నిరాకరించడం వల్ల బీజేపీ ఎలాంటి సంకేతాలను శివసేనకు పంపించిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో శివసేనను తాము అక్కున చేర్చుకోవడం వల్ల పార్టీకి లాభమే తప్ప నష్టమేదీ ఉండదని సూచిస్తున్నారు. శివసేనకు లేని భయం కాంగ్రెస్ కు ఎందుకు? అని మరి కొందరు సభ్యులు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications