10 లక్షల క్రెడిట్ కార్డ్, 5 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ. 1000: మమతా బెనర్జీ టీఎంసీ మేనిఫెస్టో
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తమ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడితే తాము చేయబోయే కీలక అభివృద్ధి పనులు గురించి వివరించారు. ఈ సందర్భంగా కోల్కతాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

100 శాతం హామీలు నెరవేర్చామన్నా మమత
తాము మరోసారి అధికారంలోకి వస్తే ఏడాదిలో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచం తమను ఎంతో మెచ్చుకుందని చెప్పారు. యూనైటెడ్ నేషన్స్ నుంచి కూడా అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. 40 శాతానికి పేదరికాన్ని తగ్గించినట్లు వెల్లడించారు. అంతేగాక, రైతుల ఆదయాన్ని మూడు రేట్లు పెంచామన్నారు మమతా బెనర్జీ. కరోనాతో కొంత వెనుకబడ్డామన్నారు.
ప్రతి బెంగాల్ కుటుంబానికి కనీస ఆదాయంటూ మమత హామీ
'మొదటిసారిగా, బెంగాల్లోని ప్రతి కుటుంబానికి కనీస ప్రాథమిక ఆదాయం ఇవ్వబడుతుంది. దీని కింద 1.6 కోట్ల జనరల్ కేటగిరీ కుటుంబాలకు నెలకు రూ. 500 , ఎస్సీ / ఎస్టీ కేటగిరీ కుటుంబాలకు రూ. 1,000 లభిస్తుంది. కుటుంబంలోని మహిళకు డబ్బు నేరుగా బదిలీ చేయబడుతుంది ' అని మమతా బెనర్జీ చెప్పారు. తాము అన్ని కులాలు, మతాల కోసం పనిచేస్తున్నామన్నారు.

విద్యార్థులకు రూ. 10 లక్షల క్రెడిట్ కార్డు..
విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డు ఇస్తున్నామని, ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు 10 లక్షల క్రెడిట్ కార్డును తీసుకువస్తామన్నారు. 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయడం జరుగుతుందన్నారు. కాగా, ముస్లిం కోసమే టీఎంసీ పనిచేస్తోందని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో హిందువులకు పర్వదినమైన మార్చి 11న మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ.. మమతా బెనర్జీ కాలికి గాయం కావడంతో వాయిదా పడింది. మూడుసార్లు వాయిదా పడిన టీఎంసీ మేనిఫెస్టో బుధవారం విడుదల చేశారు.

సువేందుతో మమతా ఢీ..
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేడీని టీఎంసీ మేనిఫెస్టో మరింత పెంచేలావుంది. కాగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారితో మమతా బెనర్జీ ఈ స్థానం నుంచి తలపడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీపై 50వేల మెజార్టీతో గెలుస్తానంటూ సువేందు అధికారి చెబుతున్నారు. బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండూ పార్టీలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా, 291 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మే 2నే పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి.












Click it and Unblock the Notifications