పెళ్లి ఊరేగింపులో అపశృతి: ఏడుగురి మృతి, అస్సాంలో మరో ఐదుగురు
దిస్పూర్: అస్సాంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అస్సాంలోని కామ్రూప్ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
జిల్లాలోని బొన్గోర సమీపంలోని రహదారిపై పెళ్లి బృందంతో వెళుతున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గౌహతి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు వీరిలో ఎనిమిది మంది పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు.
వధూవరులు మరో వాహనంలో గౌహతికి వెళ్తుండటంతో వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ట్రక్కును సీజ్ చేశారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
పెళ్లి ఊరేగింపులో అపశృతి: ఏడుగురి మృతి
పెళ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన రాజస్ధాన్లోని దుంగర్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం బిచ్చిపురలోని ఓ మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా, సడన్గా వారిపైకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.