జెండా ఆవిష్కరించిన ప్రణబ్, అమరులకు మోడీ నివాళి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్లో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మంగళవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ... సైనికుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా లాన్స్ నాయక్ మోహన్దాస్ గోస్వామి సతీమణికి రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక చక్ర పురస్కారం ప్రదానం చేశారు.
గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, పలువురు కేంద్ర మంత్రులు, సైనిక దళాల ప్రధాన అధికారులు, వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో 76మంది ఫ్రెంచి సైనికులు కవాతు నిర్వహించారు. టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, రాడార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకలు జరుగుతున్న రాజ్పథ్ మార్గంలో హెలికాప్టర్ల ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏడంచెల భద్రత అమలు చేస్తున్నారు.
అమరవీరులకు మోడీ నివాళులు
67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
కేంద్ర రక్షణమంత్రి మనోహర్పారికర్, సైనిక దళాల ప్రధాన అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో మూడంచెల భద్రత అమలు చేస్తున్నారు. ఢిల్లీలో గగనతల విహారంపై కేంద్రం ఆంక్షలు విధించింది.
కాగా, 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగ రూప కల్పనలో పాలుపంచుకున్న మహానుభావులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications