బర్త్డే ఫంక్షన్ నుంచి హాస్టల్కు: ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుమంది మెడికోల దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఏడుమంది యువకులు దుర్మరణం పాలయ్యారు. వారంతా వైద్య విద్యార్థులు. మృతుల్లో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడి కుమారుడు కూడా ఉన్నారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని హాస్టల్కు తిరిగి వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం పంపించారు.
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన సంభవించింది. మృతులందరూ వైద్య విద్యార్థులు. వార్ధాలోని సావంగి మెడికల్ కళాశాలలో చదువుకుంటున్నారు. సోమవారం సాయంత్రం వారు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఎక్స్యూవీ కారులో వార్ధాలోని హాస్టల్కు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో దేవ్లీ సమీపంలోని సెల్సుర మీదుగా ప్రయాణిస్తోన్నప్పుడు కారు అదుపు తప్పింది. బ్రిడ్జి మీది నుంచి కింది పడింది. పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో బీజేపీ శాసన సభ్యుడు విజయ్ రంగ్దలె కుమారుడు ఆవిష్కార్ రంగ్దలె ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే వార్ధా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ హోల్కర్, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం వార్ధాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
రాత్రి 11:30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్యూవీ తొలుత సెల్సుర బ్రిడ్జి రిటైనింగ్ వాల్ను ఢీ కొట్టింది. అక్కడితో ఆగలేదు. కారు వేగానికి అది నిలవలేదు. ధ్వంసమైంది. అదే వేగంతో కారు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. పల్టీలు కొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదంటే- ఈ ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదానికి గురైన సమయంలో నీరజ్ సింగ్ అనే విద్యార్థి కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.