మరో మూక దాడి: 70 ఏళ్ల వయోవృద్ధుడిని కొట్టి చంపారు: స్తంభానికి కట్టేసి మరీ..!
రాంచీ: దేశంలో మూకదాడులు అడ్డూ, అదుపు లేకుండా కొనసాగుతునే ఉన్నాయి. తబ్రేజ్ హత్యోదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వల్ల మూక దాడులకు బ్రేక్ పడుతుందని ఆశించినప్పటికీ.. దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. యథేచ్ఛగా మూకదాడులను కొనసాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా 70 సంవత్సరాల వృద్ధుడి కరెంటు స్తంభానికి కట్టేసి మరీ చొతగ్గొట్టారు. ఫలితంగా- ఆ వృద్ధుడు సంఘటనాస్థలంలోనే మరణించాడు. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బెల్బాడ్ తాలూకాలో కొండప్రాంతమైన కుచి పహారీ గ్రామంలో చోటు చేసుకుంది. వన మూలికలను ఏరుకోవడానికి వెళ్లిన వృద్ధుడు సాయంత్రం తిరిగి వస్తుండగా.. కుచి పహారీ గ్రామస్తులు అతణ్ని అడ్డగించారు.
జూపార్కులో మరణ మృదంగం: 25 రోజుల్లో మూడు ఏనుగులు మృత్యువాత: పొట్టన పెట్టుకున్న వైరస్
పిల్లలను ఎత్తుకెళ్లే వాడిగా అనుమానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వలేకపోయాడా వృద్ధుడు. దీనితో అనుమానం మరింత రెట్టింపు కావడంతో అతణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మీర్జాచౌకీ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న కొందరు గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు సాహిబ్ గంజ్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి నావల్ శర్మ తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. వారిపై మీర్జాచౌకి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.