72 గంటల్లో నివేదిక ఇవ్వాలి: ఎలాన్ మస్క్ సంస్థకు మోదీ సర్కార్ షాక్!
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ఎక్స్(గతంలో ట్విట్టర్)' తన బాధ్యతలను విస్మరిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఎక్స్' తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ 'గ్రోక్' (Grok) ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ సృష్టించబడుతోందని వస్తున్న నివేదికలపై కేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ సంస్థకు ఘాటుగా నోటీసులు జారీ చేసింది.
అసభ్యకర కంటెంట్ను అరికట్టడానికి తీసుకున్న చర్యలపై రాబోయే 72 గంటల్లో నివేదికను సమర్పించాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. గ్రోక్ ఏఐ ద్వారా మహిళల అశ్లీల చిత్రాలు, డీప్ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారని.. ఇది వారి గోప్యతను, గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఐటీ చట్టం 2000, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం సంస్థలు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను 'ఎక్స్' విస్మరిస్తోందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023 ప్రకారం తప్పనిసరి రిపోర్టింగ్ నిబంధనలను కూడా సంస్థ పాటించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.

తీవ్ర పరిణామాలు తప్పవు
ఒకవేళ 'ఎక్స్' ఈ నోటీసులకు స్పందించకపోతే లేదా నిబంధనలను అతిక్రమిస్తే, ఆ సంస్థ భారత్లో తనకున్న 'సేఫ్ హార్బర్' హోదాను కోల్పోతుంది. అంటే యూజర్లు చేసే ప్రతి పోస్టుకు చట్టపరంగా ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదనంగా భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ కేసులు, POCSO (పిల్లల రక్షణ చట్టం) కింద కఠిన చర్యలు, మహిళల అసభ్య ప్రాతినిధ్య నిషేధ చట్టం కింద పెనాల్టీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఆదేశం:
గ్రోక్ ఏఐ ద్వారా చట్టవిరుద్ధమైన కంటెంట్ సృష్టించబడకుండా ఉండటానికి దాని సాంకేతిక ఫ్రేమ్వర్క్ను సమీక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే వినియోగదారుల ఖాతాలను వెంటనే రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది.












Click it and Unblock the Notifications