రూ.300 ఖరీదు చేసే లిప్స్టిక్ ఆర్డర్ చేస్తే.. రూ. లక్ష కొట్టేశారు
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు కొల్లగొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఇలా మోసపోతోన్నవారి జాబితాలో ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి హోదాలో ఉన్నవారు సైతం ఉండడం ఆశ్చర్యానికి గురించేస్తోంది. తాజాగా నవీ ముంబైలో ఓ డాక్టర్ ఆన్లైన్ మోసానికి గురై, లక్షరూపాయలు పోగొట్టుకుంది. ఆన్లైన్లో రూ. 300 లిప్స్టిక్ కొన్నపాపానికి ఆమె తన అకౌంట్ నుంచి ఈ డబ్బును మోసగాళ్లకు సమర్పించుకోవాల్సి వచ్చింది.
నవీ ముంబైకి చెందిన ఓ లేడీ డాక్టర్ ఆన్లైన్లో రూ.300 ఖరీదు చేసే ఓ లిప్స్టిక్ నవంబర్ 2న ఈ-కామర్స్ పోర్టల్లో ఆర్డర్ చేశారు. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఆర్డర్ డెలివరీ అయిందని కొరియర్ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే స్పందించిన ఆమె ఆ మెసేజ్ను పరిశీలించింది. మీ ఆర్డర్ వచ్చిందని, మరిన్ని వివరాలకు తమ కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడాల్సిందిగా అందులో ఉంది. దీంతో కొరియర్ కంపెనీ నంబర్ను సంప్రదించగా ఆవతలి వ్యక్తి తనను తాను కస్టమర్ కేర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. అక్కడే అసలు ఆట మొదలైంది.

రూ. 2 అనుకుంటే లక్ష పోయింది : సదరు వ్యక్తి మాట్లాడుతూ.. మీ ఆర్డర్ హోల్డ్లో ఉంచబడిందని, రూ. 2 ట్రాన్స్ఫర్ చేస్తే క్లియర్ అయిపోతుందని చెప్పాడు. అందుకోసం ఆ వ్యక్తి తన బ్యాంక్ వివరాలను ఫిల్ చేయమని కోరుతూ వెబ్లింక్ పంపాడు. తమ వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని క్షమాపణ కూడా చెప్పాడు. దీంతో రెండు రూపాయలే కదా.. అన్న ధీమాతో ఆమె లింక్పై క్లిక్ చేయడంతో, ఆమె మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేయబడింది. అయితే, ఆ యాప్ను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. నవంబర్ 9న ఆమె బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, రూ.5 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. దీంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన డాక్టర్ నేరుగా దగ్గరలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తులు పంపే లింక్స్పై క్లిక్ చేయవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. రోజూ దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications