వింత ఆచారం: అక్కడ చాక్లెట్లే దేవునికి నైవేద్యం
కొచ్చి: తమపై దేవుని అనుగ్రహం ఉండాలని ఏ భక్తులైనా దేవునికి నైవేధ్యంగా పూలు, గంధం, దేవుడిని వరాలను అర్థించడానికి పండ్లు అర్పించుకుంటారు. అయితే ఇక్కడ అందుకు పూర్తిగా భిన్నంగా దేవునికి నోరూరించే చాకోలేట్ బార్లను నైవేధ్యంగా భక్తులు సమర్పించుకుంటారు. ఎక్కడంటారా?.. కేరళ రాష్ట్రంలోని ‘తెక్కన్ పలని' బాలసుబ్రమణ్య(కుమారస్వామి) ఆలయంలో భక్తులు చాకోలేట్లను నైవేధ్యంగా అర్పించుకుంటారు.
మంచి బ్రాండ్లకు చెందిన చాకోబార్లను ఆ ఆలయంలో దేవునికి నైవేధ్యంగా పెట్టిన తర్వాత, దేవునికి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వాటిని తిరిగి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. అలప్పుజ పట్టణానికి సమీపంలోని ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని ‘మంచ్ మురుగన్'గా పిలువడం జరుగుతుంది.

ఆలయ అధికారుల కథనం ప్రకారం.. భిన్న కులాలు, సంప్రదాయాలు, మతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తారని, వారందరూ చాక్లెట్లను మురగస్వామికి నైవేధ్యంగా సమర్పించి స్వామివారి దీవెనలు పొందుతారు. పరీక్షల సమయంలో ఇక్కడికి చిన్నారులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అధికారులు తెలిపారు. అయితే దేవునికి నైవేధ్యంగా అర్పించడం ఎప్పట్నుంచి ప్రారంభమైందో తెలియదని వారు చెప్పారు.
ఆలయంలో ప్రధాన దేవుడు బాల మురుగన్ అని ఆలయ మేనేజర్ డి. రాధాకృష్ణన్ తెలిపారు. బాల మురుగన్ అంటే చిన్న వయస్సులో ఉన్న దేవుడ(కుమారస్వామి)ని అర్థం వస్తుంది కాబట్టి, చిన్న పిల్లలకు చాక్లెట్లు అంటే ఇష్టమని భావించిన భక్తులు స్వామి వారికి చాక్లెట్లు సమర్పించే ఆచారం అమలులోకి వచ్చి ఉంటుందని ఆయన తెలిపారు. దేవుడికి నైవేధ్యంగా అర్పించిన చాక్లెట్లను తిరిగి భక్తులకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఇతర సంప్రదాయాల్లాగే తులాభారంలో బెల్లం, పూలు పెట్టి సమర్పించినట్లుగా ఇక్కడ కూడా చాక్లెట్లను తులాభారంలో భక్తులు సమర్పించుకుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని భక్తులేకాక ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చాక్లెట్లు నైవేధ్యంగా సమర్పిస్తారని చెప్పారు. ఇంతకుముందు చిన్నారులు మాత్రమే దేవునికి చాక్లెట్లు సమర్పించేవారు, అయితే ఇటీవలి కాలంలో అన్ని వయస్సులకు చెందిన భక్తులు చాక్లెట్లను సమర్పించుకుంటున్నారని రాధాకృష్ణన్ తెలిపారు.
కొన్ని శతాబ్ధాల క్రితం ఈ ఆలయం ఓ గొప్ప భక్తుడిచే నిర్మింపబడిందని చెప్పారు. అతను తరచూ తమిళనాడులోని పళనిలోని ప్రఖ్యాత మురుగన్ ఆలయానికి వెళ్లేవారని, అయితే ఒక రోజు స్వామివారు అతని కలలో కనిపించి తన గ్రామంలోని ఓ ఆలయం నిర్మించాలని అడగడంతో అతను ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆలయాన్ని నవీకరించినట్లు ఆయన చెప్పారు. ఆలయ నిర్వహణ కోసం 21 మంది సభ్యులు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications