బోల్తా పడ్డ అయ్యప్ప స్వాముల బస్సు
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు ఈ నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

అదే సమయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ నెల 17వ తేదీన అయ్యప్ప స్వాముల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో అయ్యప్ప స్వామి భక్తులెవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
19వ తేదీన మరో ప్రైవేట్ మినీ బస్సు నంబర్ కేఏ 13 డీ 7099 ప్రమాదానికి గురైంది. 50 మంది కర్ణాటకకు చెందిన భక్తులతో కూడిన బస్సు ఇది. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో వాయనాడ్ జిల్లాలోని తిరునెల్లి వద్ద బోల్తా పడింది. అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగుముఖం పట్టిన ఈ బస్సు మార్గమధ్యలో తిరునెల్లి-థెట్టు మధ్య అదుపు తప్పి పల్టీ కొట్టింది.
ఇప్పుడు మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని హసన్ జిల్లా తావరహళ్లికి చెందిన కొందరు భక్తులు మినీ బస్సులో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది.

కన్నూర్ జిల్లాలోని చేరుతాజం- అంబాల రోడ్ జంక్షన్ వద్ద అదుపు తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి, రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా కొందరు భక్తులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే పారియారం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ షైజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ భక్తులను పారియారం మెడికల్ కాలేజీకి తరలించారు. వారికి స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు వెల్లడించారు.
శబరిమలకు భక్తులు పోటెత్తిన నేపథ్యంలో ఈ ప్రైవేట్ ఆపరేటర్లు ఎక్కువ ట్రిప్పులను నడిపించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారని, అందుకే థామరస్సేరి వంటి ప్రమాదకర ఘాట్ సెక్షన్లల్లోనూ పరిమితికి మించిన వేగంతో బస్సులనను నడిపిస్తోన్నారనే విమర్శలు వినిపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications