ఐఎస్లో చేరిన అబ్దుల్ మనఫ్ సిరియాలో మృతి
కన్నూర్: ఉగ్ర భావజాలానికి ఆకర్షితుడై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చేరిపోయిన కేరళకు చెందిన యువకుడు సిరియాలో ప్రాణాలు కోల్పోయాడు. ఐఎస్ ఉగ్రవాదులకు మద్దతుగా పోరాటం చేస్తూ గత నవంబర్ నెలలోనే అతను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కన్నూర్ జిల్లాలోని వలపట్టినమ్కు చెందిన అబ్దుల్ మనఫ్(30) గత నవంబర్లో సిరియాలో చనిపోయాడని డీఎస్పీ సదానంద వెల్లడించారు. అయితే, అబ్దుల్ మృతి వార్త జనవరి 17నే అతడి కుటుంబసభ్యులకు తెలిసిందని చెప్పారు.

సిరియాలో ఉండే అబ్దుల్ స్నేహితుడు కయ్యూమ్ టెలిగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. కాగా, ఖయ్యుమ్ కూడా ఐఎస్ ఉగ్రవాదులకు మద్దతుగా పోరాడుతున్నాడని ఆ అధికారి తెలిపారు.
అబ్దుల్ కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఇండియా(పీఎఫ్ఐ) నాయకుడు కావడం గమనార్హం. ఉగ్రవాదుల్లో చేరే ముందు ఇతడు ఢిల్లీలో తమ సంస్థకు ఆఫీస్ సెక్రటరీగా పనిచేశారని చెప్పారు. ఇప్పటికే కేరళ రాష్ట్రం నుంచి ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి పోరాటం చేస్తున్న 15మందిలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో ఐదుగురిని ఎన్ఐఏ విచారిస్తోంది. కాగా, మరో నలుగురు సిరియాలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications