ఆదిత్య థాకరే.. వ్యక్తి కాదు శక్తి... తొలిసారి పోటీ, మట్టికరిచిన ఎన్సీపీ నేత
మహారాష్ట్ర భావి సీఎంగా ప్రచారం జరుగుతోన్న శివసేన యువ నేత ఆదిత్య థాకరే ఘన విజయం సాధించారు. వర్లీ నుంచి 60 వేల పైచిలుకు మెజార్టీ విక్టరీ కొట్టారు. ఎన్సీపీ నేత సురేశ్ మనేను ఆదిత్య మట్టికరిపించారు. థాకరే కుటుంబం నుంచి ఆదిత్య థాకరే తొలిసారి పోటీచేసిన సంగతి తెలిసిందే. స్థానిక నినాదంతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకున్నారు.
థాకరే ఫ్యామిలీ నుంచి తొలిసారి..
శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే, ఆయన కుమారుడు, ప్రస్తుత శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ ఆదిత్య మాత్రం ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీచేసి సంచలనం రేపారు. ఆయన యువసేన చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు. వర్లీ నుంచి గెలుపొందాక మీడియాతో మాట్లాడుతూ ‘ తన తల్లి, తండ్రి ఆశీర్వాదంతో విజయం సాధించానని పేర్కొన్నారు. గెలుపొందాక ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని వారు సూచించారు అని' ఆదిత్య తెలిపారు.
ఆదిత్య థాంక్స్..
తనకు భారీ మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వర్లీలో ఆదిత్యకు 89 వేల 248 ఓట్లు వచ్చాయి. 69.14 శాతం ఓట్లతో ముందువరసలో నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం నుంచి ఆదిత్య థాకరే సీఎం అభ్యర్థి అనే ప్రచారం సాగుతోంది. కానీ ఆ ప్రచారంపై ఆదిత్య సమాధానం దాటవేశారు.
నాన్నే చూసుకుంటారు..
సీఎం అభ్యర్థి అనే అంశాన్ని ఉద్దవ్ చూసుకొంటారని ఆదిత్య క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఉద్దవ్ థాకరే కుమారిడిగా తాను విజయం పొందడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన చర్చించి నిర్ణయం తీసుకుంటాయని ఉద్దవ్ థాకరే క్లారిటీ చేశారు. దీనికి సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. సమయం గురించి ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.
సేన కీ రోల్..
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమే. మెజార్టీ మార్కుకు కొద్దిదూరంలో బీజేపీ నిలిచిపోయింది. దీంతో శివసేన కీ రోల్ పోషించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ చీఫ్ అమిత్ షా చర్చిస్తారని తెలిపారు. తన ఇంటికి వచ్చి ప్రభుత్వ ఏర్పాటు గురించి డిస్కష్ చేస్తారని మీడియాకు తెలిపారు. మహారాష్ట్రలో 50-50 ఫార్ములా తెరపైకి తీసుకొస్తామని చెప్పారు. తమకంటే బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడంతో ఆ పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చాయని.. తన దృష్టిలో ఇరుపార్టీలు సమానమని ఉద్దవ్ చెప్తున్నారు.