బెయిల్, ముఖ్యమంత్రి: జయలలితపై ఆసక్తికర చర్చ
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ రావడంతో.. ఇప్పుడు ఆమె భవితవ్యంపై చర్చ సాగుతోంది. జయ అనర్హత వేటు పైన చర్చ సాగుతోంది. ఆమె మళ్లీ సీఎం పదవిని అంగీకరిస్తారా? అనే చర్చ సాగుతోంది.
బెయిల్ రావడంతో తమ పార్టీ అధినేత్రి ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుండబోతున్నారని అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. తమిళనాట అమ్మ అభిమానులు, బాణసంచా పేల్చి, నృత్యాలు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, కర్నాటక కోర్టు విధించిన శిక్ష పూర్తిగా రద్దయితేనే, ఆమెకు ఆ అవకాశం దక్కుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు రాజ్యాంగం అనుమతించదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కసారి బెయిల్ లభిస్తే, సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సవాల్ చేసుకునే అవకాశం ఉంటుందని, త్వరలోనే ఆ శిక్ష కూడా రద్దయ్యే అవకాశం లేకపోలేదని జయ తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు.

పరప్పన అగ్రహార కోర్టు న్యాయమూర్తి వెలువరించిన తీర్పు ఆధారంగానే జయను నిర్దోషిగా నిరూపిస్తామని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారంటున్నారు. అదే జరిగితే, త్వరలోనే జయలలిత తిరిగి ముఖ్యమంత్రి పీటంపై కూర్చునే అవకాశముంటుందని అంటున్నారు.
డిసెంబర్ 18వ తేదీ వరకు సుప్రీం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో జయలలిత ఈ రెండు నెలలు ఇంటికే పరిమితం కానుంది. ఆ తర్వాత ఆమెకు కోర్టులో వచ్చే తీర్పును అనుసరించి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
జయలలిత ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, సంక్రాంతి తర్వాత కావొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. జయలలితకు కర్నాటక కోర్టు శిక్షను రద్దు చేస్తేనే ఆమె అనర్హత రద్దవుతుందని చెబుతున్నారు. ఆమెకు శిక్షను నిలిపివేశారని, అంతేకానీ రద్దు కాలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications