పిఎం ఐతే హ్యాపీ: ఆశ్చర్యపర్చిన అద్వానీ, మోడీ థ్యాంక్స్
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మనసు మార్చుకున్నారు! మోడీ అభ్యర్థిత్వాన్ని కొద్ది రోజుల క్రితం వ్యతిరేకించిన అద్వానీ సానుకూలంగా మారుతున్నారు. అహ్మదాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో అద్వానీ మరో ముందడుగు వేశారు. వచ్చే ఎన్నికలలో బిజెపి గెలుపొంది, మోడీ ప్రధాని అయితే సంతోషిస్తానని చెప్పి అద్వానీ అందర్నీ ఆశ్చర్యపరిచారనే చెప్పవచ్చు.
మోడీలో ఒక అసాధారణమైన క్వాలిటీ ఉందని, అతను ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడని, అద్వానీ అన్నారు. అంతేకాదు గుజరాత్లో తమ బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకుంటున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని కూడా ఆయన అన్నారు.
గతంలో మోడీని అభ్యర్థిత్వాన్ని అద్వానీ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మోడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి డుమ్మా కొట్టారు. పార్టీ పదవులకు రాజీనామా చేశారు కూడా. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు నచ్చజెప్పడంతో అద్వానీ రాజీనామాను ఉపసంహరించుకున్నారు.
మోడీతో అద్వానీ వేదికను పంచుకోవడం అహ్మదాబాదులో రెండోసారి. అంతకుముందు భోపాల్లో జరిగిన కార్యకర్త మహాకుంభ్లో వేదిక పంచుకున్నారు.
మోడీ థ్యాంక్స్ టు అద్వానీ
అద్వానీకి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తన నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలిపినందుకు అగ్రనేతకు కృతజ్ఞతలు అన్నారు. అహ్మదాబాద్ వెస్ట్ సైడ్ను అభివృద్ధి చేశామని, అలాగే ఈస్ట్ సైడ్ అభివృద్ధి చేస్తామన్నారు.