అద్వాణి ఆవశ్యకత ఇప్పుడు గుర్తొచ్చిందా..?
ఎట్టకేలకు పార్టీ సీనియర్ నేత అద్వాని ప్రాముఖ్యతను మోదీ అమీత్ షాల జోడి గుర్తించింది. కర్ణాటక తో పాటు ఉప ఎన్నికలు ఇచ్చిన షాక్ కు అలుముకున్న మేఘాలు విడిపోయినంత పనైంది మోడి జోడీకి. ప్రాంతీయ పార్టీలతో నెలకొన్న వైరాలు, అదికారంలో ఉన్న సొంత రాష్ట్రాల్లో నెలకొన్న విద్వేషాలు చల్లార్చి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే అద్వాణి లాంటి సీనియర్ నేతకే సాద్యమని మోడీ ద్వయం భావించినట్టు తెలుస్తోంది. అందుకే నాలుగేళ్లుగా పట్టించుకోని అద్వాణికి రెడ్ కార్పెట్ వేసి మరీ మర్యాదలు చేస్తున్నారు మోదీ, అమీత్ ష లు.
మోదీ అమీత్ షా లలో సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం..
2014 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర స్రుష్టించిన భారతీయ జనతా పార్టీకి అప్పుడున్న ఆత్మ విశ్వాసం సన్నగిల్లిందా ? మోదీ, అమీత్ షా కనుసన్నల్లో నడుస్తున్న బీజేపి మనోస్తైర్యాన్ని కోల్పోయే పరిస్థితులకు ఎందుకు చేరుకుంది.? కాంగ్రేస్ హాటావో దేశ్ కో బచావో అన్న బీజేపి నినాదం ఎటు వెళ్లింది.? దేశాన్ని మొత్తం కాషాయమయం చేసే వరకు విశ్రమించేది లేదన్న బీజేపి అగ్రనేతల శపథాలు ఏమయ్యాయి.? కర్ణటకతో మొదలైన అపజయాల పరంపర దేశంలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు పరాకాష్టకు చేర్చాయా.? అందుకే మోదీ-అమీత్ షా వైఖరాలో అనూహ్య మార్పు చోటుచేసుకుందా..?? అనే ప్రశ్నలు ఇప్పడు సామాన్య బీజేపి కార్యకర్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వం పార్టీ పునర్నిమానం కోసం పనిచేసిందా ? లేక ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందా అంటే మొదటి సందేహానికే మెజారిటీ ప్రజానికం ఆమోదం తెలుపుతున్నారు. నాలుగేళ్లుగా ప్రధాన మంత్రిగా మోదీ, బీజెపి జాతీయ అద్యక్షుడుగా అమీత్ షా ప్రజా సంక్షేమం కాకుండా పార్టీ పటిష్టతపై ద్రుష్టి కేంద్రీకరించారు కాబట్టే ప్రజలు పార్టీని తిరస్కరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలతో విభేదాలు కొంప ముంచాయా..
వివిద రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అయినా ఉప ఎన్నికలయినా గెలుపై లక్ష్యంగా., అందుకోసం బీజేపి అదికార దుర్వినియోగానికి సైతం వెనకాడలేదు. దీంతో గోవా, మేఘాలయ, మణీపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపి అదికారం చెలాయిస్తోంది. దీంతో అదికారం చెలాయించడం పైనే బీజేపి ద్రుష్టి కేంద్రీకరించింది తప్ప సామాన్య ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రాష్ట్రాలపై చూపిస్తున్న సవతి ప్రేమ కూడా రాబోవు ఎన్నికల్లో బీజేపికి శరాఘాతంలా పరిణమించబోతోంది. బీజెపి మళ్లీ అదికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దత్తు ఈ సారి పెద్ద యెత్తున అవసరం అయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి సందర్బంలో మోదీ గాని అమీత్ షా గాని రంగంలోకి దిగి ప్రాంతీయ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపే సామరస్య వాతావరణం కనిపించడం లేదు.
విజయగర్వం దిగిన తర్వాతే అద్వాణీ జపం..
ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకులైన లాల్ కృష్ణ అద్వాణీ ని మోడీ రంగంలోకి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడైన అద్వాణీ గతంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కష్టపడ్డారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా అద్వాణీ సేవలను ఉపయోగించుకోవాలని మోదీ ద్వయం యోచిస్తోంది. అందుకే మోదీ పదవిలోకి వచ్చిన నాలుగేళ్లుగా పట్టించుకోని అద్వాణీకి ఇప్పుడు ప్రధాన్యత కల్పిస్తున్నారు. అవసరం అనుకుంటే అద్వాణిని ఎన్నికల బరిలోకి దింపేందుకు కూడా అమిత్ షా -మోదీ ద్వయం వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, బీహార్ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ), తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ ఎన్డీయేపై అసంతృప్తితో ఉండటాన్ని ఇప్పటికే అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది.
రాబోవు రోజుల్లో అద్వాణీ వ్యూహలే పార్టీకి అండ..
రాబోవు కాలంలో అదికారంలోకి వచ్చేందుకు అస్త్రశస్త్రాలను అద్వాణి నుండి తీసుకునేందుకు మోదీ వ్యూహం రచిస్తున్నారు. ఉప ఎన్నికలతో పాటు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ ద్వయాన్ని నింగి నుండి నేలకు తెచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. విజయగర్వంతో మూసుకుపోయిన మోదీ-అమీత్ షా కళ్లు తాజా ఫలితాలు తెరిపించాయని చర్చ జరుగుతోంది. అందుకే సీనియర్ లాంటి అద్వాణి నాయకులు కనిపిస్తున్నారని వారికి తగిన ప్రాదాన్యత ఇవ్వక పోతే పార్టీ మునుగడ ప్రశ్నార్థకం అవుతుందని మోదీ గ్రహించినందుకే బీజెపిలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. మోదీ ద్వయం ఇప్పటికైనా సీనియర్లను గుర్తించడం శుభపరిణామం అంటూ కొందరు విశ్లేషిస్తుండగా., మోదీ-అమీత్ షా కి పట్టిన అహంకారం వదిలిందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.