ఎదురుగానే దుమ్ముదులిపేశారు: మన్మోహన్-మోడీ చేయి కలిపారు!
ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు చేతులు కలిపారు! రాజ్యసభలో నోట్ల రద్దు విషయమై ప్రభుత్వంపై మన్మోహన్ తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఆ తర్వాత భోజన విరామ సమయంలో ఇరువురు చేతులు కలిపారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు చేతులు కలిపారు! అంతకుముందు రాజ్యసభలో నోట్ల రద్దు విషయమై మోడీ ప్రభుత్వంపై మన్మోహన్ తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఆ తర్వాత భోజన విరామ సమయంలో మాత్రం మోడీ - మన్మోహన్లు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
రాజ్యసభ భోజన విరామ సమయంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సభ నుంచి మన్మోహన్ సింగ్ బయటకు వస్తుండగా.. ప్రధాని మోడీ ఆయనతో కరచాలనం చేశారు. చిరునవ్వులు చిందిస్తూ ఇరువురు మాట్లాడుకున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి బయటకు వచ్చిన మోడీ.. అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలను సైతం చిరునవ్వులు చిందిస్తూ పలకరించారు.
కాగా, అంతకుముందు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ నోట్ల రద్దు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. నోట్ల రద్దుపై గురువారం రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ చర్యను చారిత్రక నిర్వహణ తప్పిదం చేసిందని మన్మోహన్ అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చాలా రోజుల తర్వాత రాజ్యసభలో మన్మోహన్ సింగ్ తన వాణిని గట్టిగా వినిపించారు. మరోవైపు, ప్రతిపక్షాల విమర్శలను అరుణ్ జైట్లీ తీవ్రంగా కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో బయటకు రాగానే మోడీ - మన్మోహన్ చేతులు కలిపారు.