జంగిల్ రాజ్..? యూపీలో మరో దారుణం... 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్,హత్య...
ఉత్తరప్రదేశ్లో వెలుగుచూస్తున్న వరుస నేరాలు 'జంగిల్ రాజ్' విమర్శలకు తావిస్తున్నాయి. గ్యాంగ్స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ 8మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే... ఇటీవల కాన్పూర్లో ఇద్దరు కిడ్నాపర్లు ఓ ల్యాబ్ టెక్నీషియన్ను హత్య చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం గోండాలో ఓ ఆరేళ్ల బాలుడు కిడ్నాప్కు గురవగా.. ఎట్టకేలకు నిందితులను ఎన్కౌంటర్ చేసి బాలుడిని రక్షించారు. తాజాగా గోరఖ్పూర్లోనూ ఓ 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్కు గురవగా... స్థానిక కెనాల్లో అతని మృతదేహం లభ్యమైంది.
ఆరో తరగతి చదువుతున్న ఆ బాలుడిని ఆదివారం(జూలై 26) కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడి తండ్రి గోరఖ్పూర్లో పాన్ షాపు నడుపుతుంటాడు. కిడ్నాప్ అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసిన దుండగులు రూ.1కోటి డిమాండ్ చేశారు. దీనిపై బాలుడి తండ్రి మాట్లాడుతూ... 'ఆదివారం మధ్యాహ్నం భోజనం ముగించుకున్నాక.. మా కుమారుడు ఆడుకునేందుకు బయటకెళ్లాడు. సాయంత్రం సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి నాకో ఫోన్ కాల్ వచ్చింది. రూ.1కోటి ఇస్తేనే మా కొడుకును విడిచిపెడుతామని చెప్పారు.' అని తెలిపాడు.
ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. గోరఖ్పూర్ ఎస్ఎస్పీ సునీల్ కుమార్ గుప్తా వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపాడు. అదే రోజు రాత్రి ఇద్దరు కిడ్నాపర్లను అరెస్టు చేశారన్నారు. అయితే అప్పటికే కిడ్నాపర్లు తన కొడుకును హత్య చేసి కెనాల్లో పడేసినట్లు చెప్పారన్నారు. కెనాల్ నుంచి మృతదేహాన్ని వెలికితీశారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.