వలసకూలీల వెతలు: రైళ్లు రద్దుచేసిన కర్ణాటక సర్కార్, యూపీ, జార్ఖండ్కు కాలిబాటన కూలీలు..
వలసకూలీల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉన్న చోట ఉపాధి లేకపోవడంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. వలసకూలీలు వెళ్లేందుకు హోంశాఖ అనుమతి ఇవ్వడంతో.. కొన్ని రాష్ట్రాలు పంపిస్తున్నాయి. అయితే అందరినీ ఓకేసారి పంపించడం కుదరదని చెబుతున్నాయి. వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన రైళ్లను కర్ణాటక ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో అక్కడ ఉండలేమనుకొన్న కూలీలు కాళ్లకు పనిచెప్పారు. సొంత రాష్ట్రానికి కాలినడకన బయల్దేరారు.
300 మంది వరకు వలసకూలీలు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ కాలినడకన బయల్దేరారు. హెబ్బల్ ప్లై ఓవర్, దేవనహళ్లి మీదుగా వలసకూలీలు వెళుతున్న వీడియోను స్థానిక ఎమ్యెల్యే కృష్ణ బైరె గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో చాలా మంది 10 నుంచి 20 ఏళ్ల లోపు వారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైళ్లను రద్దు చేయడంతో వేలాది మంది స్వస్థలాలకు నడుచుకుంటూ వెళుతున్నారు. ఇది అమానవీయమైన ఘటన.. వెళ్లేవారిని అడ్డుకొవద్దు... ఈ సమయంలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లాబీలా ప్రవర్తించొద్దు.. సాయంత్రం 5.30 వరకు బళ్లారి రోడ్లో కనిపించారు అని కర్ణాటక సీఎంకు ట్వీట్ చేశారు.
తమకు రవాణా సౌకర్యం లేకపోవడంతో యూపీ, జార్ఖండ్ నడుచుకుంటూ వెళ్తున్నామని వారు పేర్కొన్నారు. వారికి రవాణా కల్పించాలని కోరారు. కానీ వారు అసంఘటిత రంగంలో ఉన్నారని.. భవన నిర్మాణ కార్మికులు అని.. వారికి రవాణా సౌకర్యం కల్పించలేమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.